ఆస్తులన్నీ పోగొట్టుకుని దీనస్థితిలో అమితాబ్‌.. నలుగురిలో నిలబెట్టిన ధీరూభాయ్..

6 Nov, 2023 19:46 IST|Sakshi

ధీరూబాయ్‌ అంబానీ సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ధీరుడు. పెట్రోల్ బంకులో కేవలం 300 రూపాయల జీతానికి పనిచేసిన ధీరూభాయ్ 62వేల కోట్లను సంపాదించి కార్పొరేట్‌ మహా సామ్రాజ్యానికి అధిపతి.

ఓ మామూలు మసాలా దీనుసులు అమ్ముకునే డీలర్‌గా పనిచేసే ధీరూభాయ్‌.. నిరంతర కృషితో ఎన్నో ఎదురుదెబ్బలు ఓర్చుకుంటూ తన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. బిజినెస్‌ టైకూన్‌గా అవతరించారు. రిలయన్స్‌ అనే సంస్థను ప్రారంభించారు. ఇప్పుడా సంస్థ ప్రపంచంలో అతి విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఆయన ఇచ్చిన స్పూర్తి నేటి తరాలే కాదు.. రేపటి తరాలకు కూడా ఆదర్శం. అలాంటి బిజినెస్‌ టైకూన్‌ ధీరూభాయ్‌ అంబానీ గురించి బిగ్‌ బి అమితాబ్‌ తన జీవితంలో ఎదురైన సంఘటనని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురవుతారు. ఇంతకి ఏంటా సంఘటన!  

వులి దెబ్బ పడనిదే శిల శిల్పం కాదు. కొలిమిలో కాలనిదే ఆ బంగారానికి కాంతి రాదు. అమితాబ్ జీవితం అంతే. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే గాని ఆయనకు బిగ్ బి బిరుదు రాలేదు. సాదాసీదా బచ్చన్.. సాహెబ్ (దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ తీసుకునే) స్థాయికి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అది చెప్పాలంటే ఒక పుస్తకమే అవుతుందేమో. 

అలా సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్న అమితాబ్ బిజినెస్‌లోకి దిగారు. బచ‍్చన్‌కు వరుస సినిమాలు తీయాలని 1995లో ఏబీసీఎల్ కార్పొరేషన్ ను స్థాపించారు. ఏబీసీఎల్ అంటే అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేయాలని అనుకున్నారు. అలా రూ.22 కోట్లతో కెనరా బ్యాంక్ వద్ద లోన్ తీసుకుని 150 మంది ఉద్యోగులతో ఏబీసీఎల్ ను ప్రారంభించారు.  

ఏబీసీఎల్ ప్రొడక్షన్‌లో 15 సినిమాలు వచ్చాయి. ఒక్క ఏడాదిలో ఆ సినిమాలకు పెట్టిన పెట్టుబడి రూ.60 కోట్లు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో బిజినెస్‌ను  విస్తరించాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం.. భారత్ లోని బెంగళూరులో తొలిసారి మిస్ వరల్డ్ ఈవెంట్ ను నిర్వహించారు. అప్పట్లో మిస్ వరల్డ్ పోటీలు మనదేశంలో జరగడం ఫస్ట్ టైం. కానీ ఇది చాలా రిస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే? అప్పట్లో భారత్‌లో ఆడవాళ్ల గురించి ఇలాంటి ఈవెంట్లు చేయకూడదనే ఆందోళనలు జరిగాయి.

కాబట్టే ఈ ఈవెంట్ కోసం ఒక్క స్పాన్సర్ ముందుకు రాలేదు. ఈ ఈవెంట్కి బచ్చన్ సాబ్ పెట్టింది రూ.14 కోట్లపై మాటే. భారత్‌లోని ఆందోళనలతో మిస్ వరల్డ్ ఈవెంట్ భారత్ నుంచి సౌతాఫ్రికాలో రూ.34 కోట్లు పెట్టి మరి నిర్వహించారు. దీని వల్ల ఏబీసీఎల్ కి రూ.20 కోట్లు లాస్ వచ్చింది. అయితే, ఈ నష్టాల్ని పూడ్చాలంటే ఏబీసీఎల్‌లో ఏదో ఒక మంచి హిట్ సినిమాలను తెరకెక్కించారు. రెండు సినిమాల్ని తీశారు. అవి రెండు కాస్త బిలో యావరేజ్‌గా ఆడాయి. అమితాబ్‌తో మరో సినిమా తీస్తే నష్టాల నుంచి బయటపడొచ్చని మృత్యుదాత అనే సినిమానికి తెరకెక్కించారు. కానీ ఊహించని విధంగా ముందు తీసిన రెండు సినిమాల కంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 

మరోవైపు నార్త్ అమెరికాలో కొన్ని ఈవెంట్స్‌ను నిర్వహించేందుకు అమితాబ్ అక్కడా ఏబీసీఎల్‌ను ప్రారంభించారు. కానీ సరైన ప్లానింగ్ లేక ఏబీసీఎల్‌లో బుకింగ్స్ చేసే వారు కాదు. అలా ఏబీసీఎల్కి ఇటు సినిమాలు, అటు ఈవెంట్స్‌లో కలిసి రాకపోవడం వల్ల, బ్యాంక్‌కు కట్టాల్సిన బాకీలు ఇలా మొత్తం కలుపుకుని రూ.90 కోట్లతో అప్పులు పాలయ్యారు. 

దాంతో బచ్చన్‌కి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏబీసీఎల్‌కి ఫండ్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఉద్యోగులకు ఇచ్చే శాలరీ కూడా సరిపోయేది కాదు. చేసేది లేక చివరికి 1999లో ఏబీసీఎల్‌ను మూసేశారు. అదే సమయంలో ధీరూభాయి అంబానీ .. అమితాబ్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను  బచ్చన్‌ గుర్తు చేసుకున్నారు.

‘‘ జీవితంలో ఒకానొక సమయంలో నేను బ్యాంక్ రఫ్ట్ అయిపోయా దివాళ తీశాను. నేను స్థాపించిన కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. కోటానుకోట్లు అప్పులయ్యాయి. నా బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా అయ్యింది. డబ్బు సంపాదించే మార్గాలు మూసుకుపోయాయి. ప్రభుత్వ అధికారులు సోదాలు చేశారు. ఈ విషయం ధీరూ భాయికి తెలిసింది. ఎవరినీ సంప్రదించకుండా తన చిన్న కొడుకు, నా మిత్రుడు అనిల్ అంబానీతో ఇలా అమితాబ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కొంత డబ్బు ఇమ్మని పంపించాడు. అప్పుడు అనిల్ నా ఇంటికి డబ్బుతో వచ్చాడు. ఆ డబ్బు ఎంతంటే? దాంతో కష్టాలన్నీ, టెన్షల్‌లు మాయం అయ్యేవి. వారి మంచి తనానికి నేను చాలా పులకించి పోయాను. అయితే వారి సహాయం మాత్రం నేను తీసుకోలేకపోయాను. భగవంతుడి దయతో నా జీవితంలో చీకటి రోజులు పోయాయి. మెల్లిమెల్లిగా అప్పులన్నీ తీర్చగలిగాను. 

అలా ఓ సారి ధీరూ భాయి ఇంట్లో విదేశీ ప్రతినిధులతో ఒక పార్టీ పెట్టారు. నన్ను కూడా పిలిచారు. ధీరూ భాయి అందరి మధ్యలో కూర్చున్నారు. ఆ సమయంలో దేశ, విదేశాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్థులతో వ్యాపార విషయాలు మాట్లాడుతున్నారు. నన్ను చూసి తన పక్కన వచ్చి కూర్చోమని కోరారు. నాకు కొంత వింతగా అనిపించి క్షమించండి నేను అక్కడ నా మిత్రలతో కలిసి కూర్చంటానని అన్నాను. కానీ ఆయన నన్ను కూర్చోమని మరోసారి కోరారు. దిగ్గజాలు కూర్చున్న ఆ సమయంలో నన్ను చూపిస్తూ ఈ కుర్రాడు కిందపడ్డాడు. కానీ తన స్వశక్తితో మళ్లీ నిలబడ్డాడు. అని అందరితో చెప్పాడు. అలా అనడం ఆయన నాకు ఇచ్చిన గౌరవం అనేది నన్ను ఇబ్బందుల్లో నుంచి బయట పడేయడానికి ధీరూభాయ్‌ నాకు ఇవ్వాలి అనుకున్న ఆర్ధిక సహాయం కన్నా ఎక్కువ అది. ఇదీ ఆయన వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం’’ అంటూ ధీరూభాయిపై ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని వార్తలు