‘భరత్‌’.. మహేశ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

18 Apr, 2018 19:32 IST|Sakshi

ఏపీలో ఎనిమిది రోజులపాటు అదనపు షోలు

రోజుకొక అదనపు షో వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి

భారీ అంచనాల నడుమ మరో రెండు రోజుల్లో ‘భరత్‌’  థియేటర్లలోకి రాబోతున్నాడు. మహేశ్‌బాబు తొలిసారి ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుస సూపర్‌హిట్లతో దూకుడు మీదున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల సందర్భంగా ఎనిమిది రోజులపాటు డైలీ ఒక ప్రత్యేక షో ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వేసవి సెలవులు కావడం, సినిమాకు భారీగా రద్దీ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో నిర్మాత డీవీవీ దానయ్య అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు ఉదయం 5 గంటల నుంచి పది గంటల మధ్య ప్రత్యేక షో ప్రదర్శించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని థియేటర్లు, మల్టిప్లెక్స్‌ థియేటర్లలో ఈ ప్రత్యేక షోను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ అసన్‌ రేజా ఉత్తర్వులు జారీచేశారు.

మహేశ్‌బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ బ్లాక్‌బస్టర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మహేశ్‌కు పెద్దగా విజయాలు లేవు. శ్రీమంతుడు తర్వాత వచ్చిన మహేశ్‌ బాబు సినిమాలు బ్రహ్మోత్సవం, స్పైడర్‌ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్‌ను చూపిస్తూ కొరటాల శివ తెరకెక్కించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరిన్ని వార్తలు