పాడనా తెలుగు పాట!

13 May, 2015 23:51 IST|Sakshi
పాడనా తెలుగు పాట!

ప్రపంచాన్ని తన స్వరంతోనూ, గళంతోనూ ఉర్రూతలూపే ఏ.ఆర్. రెహమాన్ మరోసారి తెలుగులో గొంతు సవరించుకున్నారు. ధనుష్ హీరోగా తెలుగులోకి వస్తున్న ‘మరియన్’ సినిమా కోసం తెలుగులో పాట పాడారు. గీత రచయిత చంద్రబోస్ రాసిన ‘మనసా పదా...’ అనే తెలుగు పాటను ఆయన ఇటీవలే లాస్ ఏంజెల్స్‌లో పాడి, రికార్డు చేశారు. తమిళ మాతృక (అక్కడ సినిమా పేరు కూడా ‘మరియన్’)లోని ఈ పాట రెహమాన్ పాడినదే.
 
  సినిమా క్లైమాక్స్‌లో వస్తుందీ పాట. ‘వందేమాతరం’ ఫేమ్ భరత్ బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి ఎస్.వి.ఆర్. మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శోభారాణి విడుదల చేస్తున్నారు. నిజానికి, మొదట ఈ తెలుగు పాట పాడడానికి రెహమాన్ సంకోచించారట. కానీ, చివరకు పాట సందర్భం నచ్చి, పాడారట. ఇంకేం, రెహమాన్ గళంలో మరో తెలుగు పాట వినడానికి సిద్ధం కండి!