ఆమిర్‌ తర్వాత ఆయుష్‌!

24 Apr, 2019 00:13 IST|Sakshi

‘పియానో ప్లేయర్‌’గా ఆయుష్మాన్‌ ఖురానా వాయించిన రాగానికి చైనీస్‌ సినీ జనం ఫిదా అయిపోయారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. కథలో కంటెంట్‌ ఉంటే స్టార్‌ కాస్టింగ్‌తో సంబంధం లేదని నిరూపించారు. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య తారలుగా రూపొందిన హిందీ చిత్రం ‘అంథా ధూన్‌’. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాను ‘పియానో ప్లేయర్‌’ టైటిల్‌తో చైనాలో రిలీజ్‌ చేశారు చిత్రబృందం. అక్కడ ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

చైనాలో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన భారతీయ చిత్రాల్లో ‘అంథా ధూన్‌’ చిత్రానిది మూడో స్థానం కావడం విశేషం. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్పెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ (2016), సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ (2017) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అలాగే సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘భజరంగీ భాయిజాన్‌’ (2015), ఇర్ఫాన్‌ ఖాన్‌ ‘హిందీ మీడియం’ (2017) చిత్రాలు 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇలా పెద్ద హీరోల లిస్ట్‌ ఉన్న చైనీస్‌ మూవీ మార్కెట్‌లోకి కుర్రహీరో ఆయుష్మాన్‌ ఖురానా  చేరడం అభినందనీయం. 

మరిన్ని వార్తలు