‘బిరియాని’ రుచికరంగా ఉందంటున్నారు

22 Dec, 2013 00:35 IST|Sakshi
‘బిరియాని’ రుచికరంగా ఉందంటున్నారు
 ‘‘కొంత విరామం తర్వాత ‘బిరియాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాను. అందరూ రుచికరంగా ఉందని మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది’’ అని కార్తీ సంతోషం వెలిబుచ్చారు. కార్తీ, హన్సిక జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ‘బిరియానీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ -‘‘యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ చిత్రాలతో తెలుగులో కార్తీ హ్యాట్రిక్ సాధించారు. ‘బిరియాని’ కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘బిరియాని’ ఇంత రుచికరంగా రావడానికి కథే కారణమని దర్శకుడు పేర్కొన్నారు. తన వందో చిత్రం ఇంతలా విజయం సాధించడం పట్ల సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా ఆనందం వెలిబుచ్చారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు సహ నిర్మాతలుఎస్సార్ ప్రకాష్‌బాబు, ఎస్సార్ ప్రభు ధన్యవాదాలు తెలిపారు.