జనతా కర్ఫ్యూ.. ప్రభుత్వ సెలవు కాదు: సల్మాన్‌ ఖాన్‌

22 Mar, 2020 15:07 IST|Sakshi

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నివారణకు పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ కు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ మద్దతు ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తన అభిమానులకు తెలిపారు. ఈ మేరకు సల్మాన్‌.. తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘బస్సులు, రైళ్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దు. ‘జనతా కర్ఫ్యూ’ అనేది ప్రభుత్వం సెలవు కాదు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా ప్రమాదకరమైంది. బయటకు తిరగకుండా స్వియ నియంత్రణ కలిగి ఉండాలి’ అని సల్మాన్‌ పేర్కొన్నారు. అదేవిధంగా ‘మాస్కులు ధరించాలి. వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచు చేతులు శుభ్రపరుచుకోవాలి. సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి. స్వియ నియంత్రణతో వైరస్‌ వ్యాప్తి నుంచి రక్షించుకోవడంతోపాటు అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చు’ అని సల్మాన్‌ ట్విటర్‌లో తెలిపారు. (దేశంలో 324కి చేరిన కరోనా కేసులు)

కంటికి కనిపించని మహమ్మారిపై యుద్ధానికి కేంద్రం నడుం బిగించింది. ప్రజల సంపూర్ణ సహకారంతో చికిత్స లేని కరోనా వైరస్‌ను తరిమేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచచ్చిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగం కావడంతో.. దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వాహనాలు, రైళ్లను రద్దు అయ్యాయి. ఇప్పటికే విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు