‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ అధ్యక్షుడిగా నిర్మాత సి.కల్యాణ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లో జరిగిన ఎన్నికల్లో ‘మన కౌన్సిల్–మన ప్యానెల్’ విజయం సాధించింది. నూతన అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన వారికి, గెలిపించిన ప్రతి ఒక్కరికీ మా మన ప్యానెల్ తరపున ధన్యవాదాలు.
మా మీద ఈర్ష్యతోనే, బాధతోనో, కోపంతో, మరేదో ఇబ్బందుల్లో ఉండటం వల్లో ఈరోజు ఓటింగ్కి రాలేకపోయిన వారికి కూడా థ్యాంక్స్. ఎలాంటి ఎన్నికలు లేకుండా ఆర్గనైజేషన్ విడిపోయింది. దాన్ని ఒకటిగా కలుపుదామనే సదుద్దేశంతో నేను, ప్రసన్నకుమార్, ఆది శేషగిరిరావు, మల్టీడైమన్షన్ రామ్మోహన్రావుగారు, చదలవాడ శ్రీనివాసరావుగారితో చర్చించి అందరం ఒక తాటిపై ఉండాలని నిర్ణయించుకున్నాం. పదవీ వ్యామోహమో ఏమో కానీ.. ఓ ఆర్గనైజేషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి కనీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేకపోయాడు’’ అన్నారు.
కొత్త కమిటీ ఇదే...
సి.కల్యాణ్ అధ్యక్షుడిగా ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా కె.అశోక్కుమార్, వై.వి.ఎస్.చౌదరి, కార్యదర్శిగా టి.ప్రసన్నకుమార్, జాయింట్ సెక్రటరీగా మోహన్ వడ్లపట్ల, ట్రెజరర్గా చదలవాడ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా కె.అమ్మిరాజు, అశోక్కుమార్ వల్లభనేని, బండ్ల గణేశ్, ఆచంట గోపీనాథ్, పల్లి కేశవరావు, శివలెంక కృష్ణప్రసాద్, జి.వి.నరసింహారావు, ఎస్.కె.నయీమ్ అహ్మద్, పరుచూరి ప్రసాద్, టి.రామసత్యనారాయణ, వి.సాగర్, వజ్జా శ్రీనివాసరావు, పి.సునీల్కుమార్ రెడ్డి, కామిని వెంకటేశ్వరరావు, వి.వెంకటేశ్వరరావు గెలుపొందారు.