కౌశల్‌ను సాగనంపేందుకు స్కెచ్‌?

20 Sep, 2018 11:20 IST|Sakshi

హైదరాబాద్‌: తెలుగు రాష్టాల్లో దూసుకుపోతున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌-2. ఈ సీజన్‌ షోకు అత్యధిక ఆదరణ రావడానికి కారణమైన కంటెస్టెంట్‌ల్లో కౌశల్‌ ఒకడు. ఇక్కడ కౌశల్‌ గురించే షో చూస్తున్న వారి సంఖ్య భారీ స్థాయిలోనే ఉంది. ఇటీవల కౌశల్‌ ఆర్మీ పేరుతో రెండు భారీ ర్యాలీలు నిర్వహించడం అతనికి షోలో ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఒక ర్యాలీ హైదరాబాద్‌ వేదికగా జరిగితే, మరొకటి విజయవాడ వేదికగా జరిగింది. ఈ రెండు ర్యాలీల్లో కౌశల్‌ అభిమానులు ఎక్కువగానే పాల్గొనే తమది ఫేక్‌ ఆర్మీ కాదని చెప్పకనే చెప్పారు.

ఈ క్రమంలోనే  కౌశల్‌కు పడుతున్న ఓటింగ్‌ కూడా అత్యధికంగానే ఉంది. ప్రధానంగా కౌశల్‌ హౌస్‌లో కొనసాగాలనే ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉంచితే, బిగ్‌బాస్‌ షో ఫైనల్‌ ఫేజ్‌కు చేరుకున్న తరుణంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వారం చివరి ఎలిమినేషన్‌ రౌండ్‌ కావడంతో ఎవరు బయటకు వెళతారు.. ఫైనల్‌కు వెళ్లే ఆ ఐదుగురు ఎవరు అనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది.  కాగా, ఆఖరి ఎలిమినేషన్‌గా కౌశల్‌ను హౌస్‌ నుంచి బయటకు పంపే ప‍్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఓటింగ్‌ సంగతి పక్కను పెట్టి, కౌశల్‌ను సాగనంపేందుకు  నిర్వాహకులు స్కెచ్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప‍్రతీవారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎవరు బయటకు వెళ్లబోయేది లీక్‌ల ద్వారా ముందుగా తెలిసినట్లే, ఈ వారం ఇంటి నుంచి వెళ్లబోయే వ్యక్తి కౌశల్‌గా తెలుస్తోంది. ఒక స్క్రిప్ట్‌ ప్రకారమే కౌశల్‌ను వెళ్లగొట్టడానికి బిగ్‌బాస్‌ యాజమాన్యం ఇప‍్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసిందని, దానిలో భాగంగానే హౌస్‌లోని కంటెస్టెంట్‌లు  మూకుమ్మడిగా కౌశల్‌పై ఎదురుదాడికి దిగి అతన్ని రెచ్చగొడుతున్నారని సోషల్‌ మీడియా వేదికగా టాక్‌ నడుస్తోంది. ఒకవేళ నిజంగానే కౌశల్‌కు ఓటింగ్‌ శాతం తక్కువ వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోతే ఇబ్బంది ఉండదు.. కానీ కావాలనే అతన్ని బయటకు పంపే యత్నం కానీ, పంపడం కానీ జరిగితే మాత్రం బిగ్‌బాస్‌ షోకు ఉన్న ఆదరణ తగ్గిపోవడం ఖాయమని అంటున్నారు కౌశల్‌ అభిమానులు. అదే సమయంలో బిగ్‌బాస్‌ షోపై ఉన్న విశ్వసనీయత కూడా సన్నగిల్లుతుందనేది కౌశల్‌ ఆర్మీ వాదనగా ఉంది.


‘ఇసుక’ టాస్క్‌లోనూ కౌశలే టార్గెట్‌..

ప‍్రతీవారం కనీసం ఒక టాస్క్‌ను నిర్వహించడం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈ వారం కూడా టాస్క్‌ను నిర్వహించారు. అది ‘ఇసుక’ టాస్క్‌. ప్రస్తుతం ఉన్న ఆరుగురి కంటెస్టెంట్‌లకు కలిపి రేస్‌-1, రేస్‌-2గా ఈ టాస్క్‌ నిర్వహించారు. ఇందులో తలో ముగ్గురు రెండు భాగాలుగా విడిపోయి టాస్క్‌లో పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానంగా కంటైనర్‌లో ఉన్న ఇసుకను కాపాడుకోవడమే ఆయా కంటెస్టంట్‌లు చేసే పని. అయితే ఈ టాస్క్‌ లో కూడా కౌశలే టార్గెట్‌ అయ్యాడు. కౌశల్‌ను గెలవకుండా చేయడంలో మిగతా కంటెస్టెంట్‌లు సక్సెస్‌ అయితే, రోల్‌ రైడాను, సామ్రాట్‌లు విజయం సాధించడంలో హౌస్‌ మేట్స్‌ సహకరించారు. ఈ ఇద్దరికీ ఇవ్వబడిన గుడ్లు టాస్క్‌లో విజయం సాధించే అభ్యర్థి ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అంటే రోల్‌ రైడా, సామ్రాట్‌లలో ఒకరు నేరుగా ఫైనల్‌కు వెళతారు.

నా మీద కుక్కల్లాగ పడుతున్నారు..

ఈ టాస్క్‌ జరిగే క్రమంలో కౌశల్‌ నోరు జారాడు. హౌస్‌మేట్స్‌తో జరిగిన వాగ్వాదంలో కౌశల్‌ తన సహనాన్ని కోల్పోయాడు. అంతా కలిసి తనపై కుక‍్కల్లాగ పడుతున్నారంటూ వ్యాఖ్యానించాడు. దాంతో ఆ వాగ్వాదానికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. ఇక్కడ కౌశల్‌ తన అన్న మాటను డిఫెన్స్‌ చేసుకునే పనిలో పడ్డా, మొత్తంగా చూస్తే సదరు హౌస్‌మేట్స్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే సామ్రాట్‌ కూడా కౌశల్‌ అన్న అనుచిత వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘మమ్మల్ని కుక్కలు అంటావా’ అని సామ్రాట్‌ నిలదీయగా, దానికి మిగతా వారి నుంచి మద్దతు లభించడంతో కౌశల్‌ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే యత‍్నం చేశాడు. తాను ఎవర్నీ ప్రత్యేకించి కుక్కలు అనలేదని, కుక్కల్లాగా పడుతున్నారనే వ్యాఖ్యానించానని సర్దిచెప‍్పుకునే యత్నం చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే, బిగ్‌బాస్‌ షోకు ఏదైనా జరగొచ్చు అనేది ఉప శీర్షిక. దానికి తగ్గట్టే ఈ వారం ఏమి జరుగుతుందనే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కౌశల్‌ను పంపేందుకు ముందుగానే స్కెచ్‌ సిద్ధం చేశారా.. లేక ఓటింగ్‌ ప్రకారమే ఒకరు బయటకు వెళతారా అనేది త్వరలో తేలనుంది. ఏం జరుగుతుందో చూద్దాం.

చదవండి:  కౌశల్‌ ఆర్మీ భారీ ర్యాలీ

మరిన్ని వార్తలు