మూడో రోజు భారీ కలెక్షన్లు

3 Oct, 2016 20:02 IST|Sakshi
మూడో రోజు భారీ కలెక్షన్లు

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లో 66 కోట్ల రూపాయలు (గ్రాస్) వసూళ్లు సాధించింది. తొలి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం విశేషం. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు 21.30 కోట్లు, రెండో రోజు శనివారం 20.60 కోట్లు రాగా, మూడో రోజు ఆదివారం  24.10 కోట్ల రూపాయలు వచ్చాయి.

మూడు రోజుల్లో 60 కోట్ల రూపాయల మార్క్‌ దాటుతుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనా వేసినట్టే జరిగింది. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. ఇక ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక వీకెండ్ కలెక్షన్లలో సుల్తాన్ తర్వాత రెండో స్థానంలో ఎంఎస్ ధోనీ నిలిచింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు.