ప్రిన్సిపాల్ పాత్రలో డా.రాజేంద్రప్రసాద్

29 Jun, 2013 05:20 IST|Sakshi
ప్రిన్సిపాల్ పాత్రలో డా.రాజేంద్రప్రసాద్
నేటి విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రక్షాళన చేసే శక్తిమంతమైన ప్రిన్సిపాల్ పాత్రలో డా.రాజేంద్రప్రసాద్ నటిస్తున్న చిత్రం ‘టాప్ ర్యాంకర్స్’. ‘జర్నీ బిట్వీన్ ఎల్‌కేజీ టు ఎమ్‌సెట్’ అనే ఉపశీర్షికతో గోళ్ళపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో పసుపులేటి బ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
 వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘రాజేంద్రప్రసాద్ నటవిశ్వరూపాన్ని మరోసారి చూపించే చిత్రం ఇది. కథ, కథనం ఆసక్తిగా ఉంటాయి. స్టూడెంట్స్ అంటే ర్యాంకులు సాధించే మెషీన్లు కాదు.. వారి ఇష్టాయిష్టాలను, అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మీద ఉందని చెబుతున్నాం. 
 
 మార్కులకన్నా మనోవికాసం, వ్యక్తిత్వ వికాసం పొందటం ముఖ్యమనేది ఈ చిత్రం ప్రధానాంశం’’ అని చెప్పారు. విశ్వవిజన్ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, జయసూర్య, కెమెరా: శంకర్ కంతేటి.