విశాల్‌పై చర్యలు తీసుకుంటాం 

26 Nov, 2019 09:49 IST|Sakshi

చెన్నై : నటుడు విశాల్‌పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు నటుడు.నిర్మాత కే.రాజన్‌ తెలిపారు. ఆర్చెర్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నవ నటుడు ఉదయ్‌ కథానాయకుడిగా పరిచయమవుతూ నిర్మిస్తున్న చిత్రం ఉదయ్‌. నటి లీమా కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ్‌సెల్వన్‌ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారరం ఉదయం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత కే.రాజన్, గిల్డ్‌ అధ్యక్షుడు జాగ్వతంగం ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

ఈ వేదికపై కే.రాజన్‌ మాట్లాడుతూ నిర్మాతల మండలిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నటుడు విశాల్‌ ఈ సంఘాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. సుమారు రూ.13 కోట్లు అవకతవకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతకుముందు ఇబ్రహిం రావుత్తర్‌ నిర్మాత కలైపులి ఎస్‌.ధాను వంటి వాళ్లు నిర్మాతల సంఘానికి నిధులను చేర్చి పెట్టగా దాన్ని విశాల్‌ విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఆయన సంఘానికి చెందిన ఆదాయవ్యయ ఖర్చులను చెప్పి తీరాలని, లేని పక్షంలో విశాల్‌పై తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని కే.రాజన్‌ పేర్కొన్నారు. కాగా ఉదయ్‌ చిత్ర పాటలు, ప్రచార చిత్రం బాగున్నాయని, ఈ చిత్రానికి విడుదల సమయంలో తగిన థియేటర్లు లభించేలా సహకరిస్తామని ఆయన అన్నారు. చిత్ర హీరో ఉదయ్‌ మాట్లాడుతూ తనకు హీరోగా ఇదే తొలి చిత్రం అని, ఇంతకు ముందు ఒక షార్ట్‌ ఫిలింలో నటించిన అనుభవంతో ఈ చిత్రంలో నటించానని తెలిపారు. ఉదయ్‌ చిత్రం లవ్, యాక్షన్, సెంటిమెంట్‌ తదితర అంశాలు కలిసిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, అన్ని వర్గాలకు నచ్చే చిత్రంగా ఉంటుందని చెప్పారు. 

మరిన్ని వార్తలు