టాలీవుడ్‌లో తొలి క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీ ‘మను’

1 Nov, 2017 13:08 IST|Sakshi

పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన స్టార్‌ వారసుడు గౌతమ్‌. హాస్య నటుడు బ్రహ్మానందం వారసుడిగా తెరంగేట్రం చేసిన గౌతమ్‌ సక్సెస్‌ సాధించలేకపోయాడు. వారెవా, బసంతి సినిమాలు కూడా గౌతమ్‌కు నిరాశే మిగిల్చాయి. తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న గౌతమ్‌ త్వరలో ‘మను’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా నిర్మాణం​ విషయంలో కొత్త ప్రయోగం చేశారు చిత్రయూనిట్‌.

మధురం, బ‍్యాక్‌ స్పేస్‌ లాంటి షార్ట్‌ ఫిలింస్‌ తో మంచి గుర్తింపు తెచ్చేకున్న ఫణీంద్ర ఈ సినిమాతో దర‍్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా నిర్మాణం కోసం కావాల్సిన మొత్తాన్ని క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా కలెక్ట్‌ చేశారు. తమ సినిమా నిర్మాణం కోసం ఫండ్‌ కావాలని చిత్రయూనిట్‌ సోషల్‌ మీడియాలో ఇచ్చిన ప్రకటనకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఏకంగా  కోటీ 20 లక్షలకు పైగా క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా కలెక్ట్‌ అయ్యింది. ఆ మొత్తం తోనే సినిమాను పూర్తి చేశారు. క్రౌడ్‌ ఫండింగ్‌ పద్దతిలో నిర్మాణం జరుపుకున్న తొలి తెలుగు సినిమా మనునే కావటం విశేషం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు