‘‘విజయ్ దేవరకొండ ప్యాషన్ ఉన్న హీరో. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం తనకి మరింత పేరు తెచ్చిపెడుతుంది’’ అని చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురాం (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. జిఏ2 పిక్చర్స్ బ్యానర్లో ‘బన్ని’ వాసు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ –‘‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం తర్వాత పరశురాం మా బ్యానర్లో చేసిన రెండో చిత్రం ‘గీత గోవిందం’. తను మంచి కమిట్మెంట్ ఉన్న దర్శకుడు. ఇందులో రష్మిక పాత్ర పేరు గీత. ఈ చిత్రం తర్వాత తనని గీత అని పిలుస్తారు.
అంత బాగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. గోవిందం అనే పాత్రలో విజయ్ ఇప్పటివరకూ చెయ్యని విభిన్నమైన షేడ్స్లో కనిపిస్తాడు. తన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర డిజైన్ చేశా. ఆగస్టు 15ని సేవ్ చేసుకోండి’’ అన్నారు దర్శకుడు పరశురామ్. ‘‘మా చిత్రంలో గీత, గోవిందం చేసే అల్లరి యూత్ని ఆకట్టుకుంటుంది. పరశురాంకి ఫ్యామిలీ ఎమోషన్స్ తెరకెక్కించటం వెన్నతో పెట్టిన విద్య. గోపీసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం’’ అన్నారు ‘బన్ని’ వాసు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి.