నాలో హీరోనీ... విలన్‌నీ గుర్తించింది ఆయనే!

23 May, 2016 23:45 IST|Sakshi
నాలో హీరోనీ... విలన్‌నీ గుర్తించింది ఆయనే!

‘‘2007లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్న నాలో హీరోను చూసింది ఇంద్రగంటి మోహన్‌కృష్ణ గారే. మళ్లీ 2016లో విలన్‌ను చూసింది కూడా ఆయనే. నాలో ఏదైనా కొత్త యాంగిల్ బయటకు రావాలంటే ఆయనతోనే సినిమా చేయాలేమో’’ అని హీరో నాని అన్నారు. నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్‌మన్’. మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హీరో రానా హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ- ‘‘చిన్నతనంలో ఓ సారి రెండు ఆడియో సీడీలు కొనడానికి వెళ్లాను. ఒకటి మణిశర్మ, ఇంకోటి ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన పాటల సీడీ. ఏ.ఆర్.రెహమాన్‌గారి సీడీ రేట్ పెంచేయడంతో నా దగ్గర ఉన్న డబ్బులు చాల్లేదు. అప్పుడు మణిశర్మగారి సీడీ దొంగతనం చేశా. నా ఫేవరేట్ మూవీ ‘ఆదిత్య 369’ నిర్మించిన కృష్ణప్రసాద్‌గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేనేదో టైమ్ మెషీన్ ఎక్కి, ఈ సినిమా చేసినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో నేను హీరోనా? విలనా? అని అందరికీ  కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అదేంటో తెలియాలంటే జూన్ 17 వరకూ వెయిట్ చే యాల్సిందే’’ అని అన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ- ‘‘ఈ కథ రాసుకున్నప్పుడు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూశాను.

‘అష్టాచమ్మా’ తర్వాత నానీతో మళ్లీ సినిమా చేయాలంటే  ఇంకా మంచి కథ కావాలి. అతన్నీ, నన్ను బాగా ఎగ్జైట్ చేయాలి. గత ఏడాది మార్చిలో నానీకి ఈ కథ వినిపించాను. ఈ సినిమా నానీకే సెట్ అవుతుందని నమ్మి అతని కోసం డిసెంబరు వరకూ వెయిట్ చేశాను. నేనెందుకు వెయిట్ చేశానో ఈ సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. మణిశర్మగారితో పని చేయడం ఇదే తొలిసారి.

చాలా మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. రానా మాట్లాడుతూ- ‘‘ఇంత పాజిటివ్‌గా ఉండే నాని విలన్‌గా ఎలా చేస్తాడో అని డౌట్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో శివలెంక కృష్ణప్రసాద్, మణిశర్మ, సురభి, నివేదా థామస్, ఈషా, దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి, మారుతి, అవసరాల శ్రీనివాస్, నిర్మాత కె.అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.