మహేశ్‌ కత్తిపై మళ్లీ హైపర్‌ ఆది పంచులు!

7 Jan, 2018 17:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మధ్య వివాదం ఇప్పుడు ఉద్రిక్తతలు రేపుతోంది. తనపై పవన్‌ కల్యాణ్‌ అభిమానులు వ్యక్తిగత దూషణలు, దాడులకు దిగుతుండటంతో మహేశ్‌ కత్తి తాజాగా బహిరంగ సవాళ్లకు దిగారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌కు సూటిగా ప్రశ్నలు సంధించారు. పూనం కౌర్‌ విషయంలోనూ పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పవన్‌ అభిమానులు అక్కడికి వచ్చి మహేశ్‌ కత్తిని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది ఇలా ఉండగా మహేశ్‌ కత్తి యథారీతిలో పవన్‌ ఫ్యాన్స్‌ తీరుపై తన ప్రతి విమర్శలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్‌ కమేడియన్‌ హైపర్‌ ఆది తాజాగా ట్విట్టర్‌లో కత్తి లక్ష్యంగా విమర్శల దాడికి దిగారు. మహేశ్‌ కత్తి ఓ సైకో అంటూ విమర్శించారు. ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైపర్‌ ఆది ఏమన్నారంటే.. ’అనవసరమైన వాళ్లకి అర్హత లేని వాళ్ళకి అనుచితంగా స్టార్‌ చైర్‌ వేసి కూర్చోపెట్టకండి. అతను ఒక సైకో. అతనికి కావాల్సింది డబ్బు.. విలువలూ ప్రేమలూ  కాదు. ఏ అనుబంధాలు లేని వాడికి ఇవ్వన్నీ అర్థంకావు. అనవసరమైన ఎక్సైట్‌మెంట్‌తో, క్యూరియాసిటీతో ఇది వరకే ఒకరిని అందలం ఎక్కించారు. ఇదంతా ఆపేయండి’ అని హైపర్‌ ఆది ట్వీట్‌ చేశారు.

’ఫ్యాన్స్‌ అందరికి ఒక విన్నపం. కత్తి మహేశ్‌ను ప్రతి ఒక్కరూ అన్‌ఫ్రెండ్‌ చేసి బ్లాక్‌ చేయండి. అతన్ని ఏకాకిని చేయండి. అతనో మానసిక రోగి. అతనికి ఏ ఫ్యాన్‌ కూడా స్పందించకూడదని కోరుకుంటున్నా. వాడి ట్వీట్‌ కింద ఏ ఒక్కరూ దయచేసి రీట్వీట్‌లు పెట్టకండి’ అని మరో ట్వీట్‌లో అన్నారు. ‘మరి వేణు అన్న లైవ్ లో చెప్పాడు కదా.. మైండ్ దొబ్బినోళ్ళతో పవన్‌ ఫ్యాన్స్ మాట్లాడొద్దని.. అదే ఫాలో అవ్వండి. మహేశ్‌ కత్తికి మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది అనుకుంటా.. ఓరే క్యూట్‌ బ్యాయ్‌ అప్పుడే అయిపోయిందనుకోకు. ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలామంది వస్తారు. నేను ట్విట్టర్‌లోకి వచ్చిన రోజే చెప్పా.. నువ్వు ఇంకా ఫినిష్‌ అని’ అని ఆది రాసుకొచ్చారు.

మరిన్ని వార్తలు