ఆ నటుడు నన్ను మోసం చేశాడు: నటి హేమ

18 Mar, 2016 18:10 IST|Sakshi
ఆ నటుడు నన్ను మోసం చేశాడు: నటి హేమ

హైదరాబాద్ : ఓ తమిళ నటుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సినీ నటి, నిర్మాత హేమలత అలియాస్ హేమ వెల్లడించింది. పోలీసులకు, సినీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ... వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో పుట్టి పెరిగానని, సినిమాలపై మక్కువతో తెలుగులో అవకాశాలు రాక 2011లో చెన్నై వెళ్లినట్టు తెలిపింది.

ప్రకటనల్లో, సినిమాల్లో నటించి, ఓ నిర్మాణ సంస్థను స్థాపించినట్టు తెలిపింది. దాని ద్వారా రెండు సినిమాలు తీశానని, తెలుగు, తమిళ సినిమాల్లో నటించినట్టు వెల్లడించింది. ఈ క్రమంలో 2014 జనవరి నెలలో తమిళ హీరో ఇళయరాజా తనకు పరిచయమయ్యాడని, పరిచయం ప్రేమగా మారి రెండు సంవత్సరాలు సహజీవనం చేసినట్లు తెలిపింది. 2015లో తన ఇంట్లోనే ఇద్దరం వివాహం చేసుకున్నట్టు పేర్కొంది.

ఈ విషయం ఇళయరాజా కుటుంబ సభ్యులకు, తన కుటుంబ సభ్యులకు తెలుసునని చెప్పింది. ఇళయరాజా సోదరుడి వివాహం అయిన తర్వాత బహిరంగంగా పెళ్లి జరిపిద్దామని నమ్మబలికాడని.. అంతలోపు గర్భం దాలిస్తే అబార్షన్ కూడా చేయించినట్లు తెలిపింది. 2015 సెప్టెంబర్ 3వ తేదీన ఇళయరాజా ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అతనికి వేరే యువతితో వివాహం నిశ్చయమైందని ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకుని తమిళనాడులోని మధురవాయిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది.

 

కాగా ఇళయరాజా కుటుంబానికి రాజకీయ అండ ఉండడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని హేమ ఆరోపించింది. హైదరాబాద్‌లో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసు ఉన్నతాధికారులను కలిసినా ప్రయోజనం లేదని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ కార్యక్రమంలో ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షులు వి.కృష్ణారావు పాల్గొన్నారు.