ఒక వేడుక... ఇద్దరు ఫ్రెండ్స్‌ను విడదీసింది!

1 Jan, 2016 23:32 IST|Sakshi
ఒక వేడుక... ఇద్దరు ఫ్రెండ్స్‌ను విడదీసింది!

నిన్న మొన్నటి వరకూ ప్రియాంకా చోప్రా, ఫ్రీదా పింటో చాలా స్నేహంగా ఉండేవాళ్లు. ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించుకోవడం, ఆత్మీయంగా హగ్ చేసుకోవడం, తియ్యగా కబుర్లు చెప్పుకోవడం... ఇలా చాలా బాగుండేవాళ్లు. ఇప్పుడు మాత్రం ఇద్దరూ ఎదురుపడితే మొహాలు తిప్పుకోవడం, ఒకవేళ చూపులు కలిస్తే, కాల్చేలా చూసుకోవడం, వీలైనంత డిస్టెన్స్ పాటించడం చేస్తున్నారు. ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ ఇలా ఎనిమీస్‌గా మారిపోవడానికి కారణం ఓ వేడుక.

ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో ప్రియాంక, ఫ్రీదా పాల్గొన్నారు. ఇందులో పాల్గొనడానికి అంగీకరించినప్పుడు ఇద్దరూ స్నేహితులే. కానీ, దీనికి సంబంధించిన ఇన్విటేషన్ వచ్చాక ప్రియాంక రగిలిపోయారు. ఆహ్వాన పత్రికలో ఫ్రీదా పింటో పేరు తర్వాత ప్రియాంక పేరు ముద్రించారు. ఆ విషయంలో ప్రియాంక చాలా ఫీలైపోయారు. ఆ కోపంతో వేడుకకు హాజరైన ఈ బ్యూటీ ఫ్రీదాతో సరిగ్గా మాట్లాడలేదట.

దాంతో ఫ్రీదా ఫీలైపోయి, మాట్లాడటం మానేశారట. అసలే కోపం మీద ఉన్న ప్రియాంకను మరింత ఆగ్రహానికి గురి చేసేలా.. ఫ్రీదాని వేదికపైకి ఆహ్వానిస్తూ, ‘హోస్ట్’ అనీ, ప్రియాంకను ఆహ్వానిస్తూ, ‘కో-హోస్ట్’ అని సంబోధించడంతో వాతావరణం వేడెక్కిపోయింది. అక్కడికక్కడ ఆ వేడుక నిర్వాహకులతో ప్రియాంక వాదనకు దిగారట. కానీ, పిలుపులు అయిపోయాక తామేం చేయలేమని వాళ్లనడంతో.. ప్రియాంక మూడాఫ్ అయిపోయారు. వేడుక జరిగినంతసేపూ ఆమెలో నవ్వు అనేది కనిపించలేదట. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా? అన్నట్లుగా వ్యవహరించారని టాక్. ఏదేమైనా ఒక వేడుక... ఇద్దరు ఫ్రెండ్స్‌ను విడదీసేసింది.