దిల్‌ రాజు ఇంట్లో ఐటీ సోదాలు

9 May, 2019 04:04 IST|Sakshi

‘మహర్షి’సినిమా విక్రయాలపై అనుమానాలతోనే!

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అధినేత దిల్‌ రాజు ఇంటిపై ఐటీ సోదాలు జరిగాయి. ఆయన సహ నిర్మాతగా ఉన్న మహర్షి సినిమా గురువారం భారత్, అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. సినిమా విడుదలకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఆదాయపు పన్ను అధికారులు తనిఖీలు చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. సినిమా బడ్జెట్‌ రూ.150 కోట్లు దాటిందని, సినిమాను భారీ ధరలకు విక్రయించారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ సోదాలు చర్చనీయాంశంగా మారాయి.

బుధవారం ఉదయం దిల్‌రాజు కార్యాలయం, ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా అధికారులు పలు రికార్డులు పరిశీలించారు. ఇటీవల దిల్‌ రాజు నిర్మాణంలో సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్‌–2’సినిమాకు సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించినట్లు తెలిసింది. పెద్ద సినిమా విడుదలకు ముందు ఇలాంటి తనిఖీలు సాధారణమేనని ఓ అధికారి పేర్కొన్నారు. మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ సినిమాను అశ్వనీదత్, పీవీపీతో కలసి దిల్‌రాజు సంయుక్తంగా నిర్మించారు. 

మరిన్ని వార్తలు