అమ్మ పాత్రలో మాధురీ.. జాన్వీ థ్యాంక్స్

19 Mar, 2018 20:30 IST|Sakshi
నటి శ్రీదేవితో మాధురీ దీక్షిత్ (ఫైల్ ఫొటో)

భావోద్వేగానికి లోనైన నటి జాన్వీ కపూర్

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ తాజాగా ఓ మూవీని నిర్మిస్తున్నారు. అభిషేక్ వర్మన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న మూవీ 'శిద్ధత్'. ఈ మూవీలో ఓ కీలకపాత్ర నటి శ్రీదేవి పోషించాల్సి ఉంది. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటి ఇటీవల చనిపోవడంతో ఆమె స్థానంలో మరో సీనియర్ నటి కోసం అన్వేషించారు. చివరికి శ్రీదేవి ఒప్పుకున్న పాత్రకు న్యాయం చేస్తారని మాధురీ దీక్షిత్‌ను తీసుకుంది మూవీ యూనిట్.

శ్రీదేవి, బోనికపూర్ పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'అభిషేక్‌ వర్మ తర్వాతి సినిమా స్టోరీ మా అమ్మ హృదయానికి చాలా దగ్గరైంది. అలాంటి సినిమాలో భాగం కానున్న మాధురీదీక్షిత్‌కు నా తరఫున, నాన్న బోనీకపూర్, ఖుషీల తరఫున ధన్యవాదాలు’  అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అమ్మ చేయాల్సిన పాత్రకు మాధురీ న్యాయం చేస్తారని అభిప్రాయపడ్డ జాన్వీ.. అమ్మ చేస్తానని ఒప్పుకున్న సినిమా కావడంతో భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. 

శ్రీదేవితో మూవీ చేయాలని భావించారు కరణ్. కానీ అంతలోనే అతిలోక సుందరి హఠాన్మరణం చెందడంతో కరణ్ సైతం ఎంతో బాధ పడ్డారని సన్నిహితులు తెలిపారు. మరోవైపు జాన్వీ తొలి సినిమా 'దఢక్‌' నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని కూడా కరణ్‌ జోహార్ నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు