Adil Hussain Recalls Sridevi: ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న శ్రీదేవి.. గుర్తు చేసుకున్న ఆదిల్

3 Nov, 2023 10:40 IST|Sakshi

ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించిన అందాల తార శ్రీదేవి. ఆమె మరణించినా నేటికి శ్రీదేవి పేరు చిరస్మరణీయం. భారతీయ దిగ్గజ నటీమణులలో ఒకరిగా శ్రీదేవి పరిగణించబడ్డారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా మెరిసిన శ్రీదేవి 1990ల చివరలో నటనకు విరామం తీసుకుంది. ఆ తర్వాత 2012 మళ్లీ ఇంగ్లీష్ వింగ్లీష్‌తో ఆమె పవర్-ప్యాక్డ్ పునరాగమనం చేసింది. ఈ చిత్రంలో శ్రీదేవికి సహనటుడిగా నటించిన ఆదిల్ హుస్సేన్ ఇటీవల పలు ఆసక్తకరమైన విషయాలు పంచుకున్నాడు.

ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఆదిల్ గుర్తుచేసుకున్నాడు. ఆమెతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.  శ్రీదేవిని కలిసినప్పుడు ఆమె నటించిన సద్మా చిత్రం తనకు గుర్తుకు వచ్చిందట. వేశ్యాగృహంలో చిక్కుకున్న నేహలతగా శ్రీదేవి నటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆ చిత్రం తనపై ఎంత ప్రభావం చూపిందని, సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులుగా తాను తినలేకపోయానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

'మొదటగా డైరెక్టర్‌ గౌరీ షిండేనే నన్ను శ్రీదేవికి పరిచయం చేశారు. అప్పుడు ఆమె తన పెద్ద అందమైన కళ్లతో నన్ను చూసింది. సద్మా సినిమా చూసిన తర్వాత నేను ఏమీ తినలేను అని నేను ఆమెకు మొదట చెప్పాను. శ్రీదేవిని చూడగానే అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి.  అప్పుడు నా మాటలు విన్న తర్వాత, ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి..  ఎందుకో నాకు కూడా తెలియదు. ఆమె కొద్దిగా మృదువైన తడి కళ్లు కలిగి ఉంది. అలా చాలా సమయం తర్వాత మేము రిహార్సల్స్‌కు వెళ్లాము.' అని చెప్పాడు.

మెరిల్ స్ట్రీప్‌తో సమానంగా శ్రీదేవి: ఆదిల్ హుస్సేన్
శ్రీదేవిని హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్‌తో పోలుస్తూ.. ఆమె  'చాలా సెన్సిటివ్' అని పాశ్చాత్య దేశాల మాదిరిగానే ఆమెకు కథలు ఆఫర్ చేసి ఉంటే, శ్రీదేవికి ఆస్కార్ లభించేదని అన్నారు. ఇంగ్లిష్ వింగ్లీష్ గౌరీ షిండే రచించి దర్శకత్వం వహించింది. 2012లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సాధించింది.

శ్రీదేవి, జాన్వీ కపూర్‌ల మధ్య పోలికలు
శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వీ కపూర్‌ మధ్య ఉన్న సారూప్యత గురించి కూడా ఆదిల్‌ వివరించాడు. జాన్వీ తన  తన తల్లి నుంచి చాలా "గుణాలను" వారసత్వంగా పొందిందని చెప్పాడు. "శ్రీదేవిని మరోకరు మ్యాచ్‌ చేయడం చాలా కష్టమైన పని..  కానీ జాన్వీ  కష్టపడి పనిచేస్తే శ్రీదేవికి దక్కినంత గౌరం, పేరు తప్పకుండా వస్తాయి. జాన్వీలో ఆ టాలెంట్‌ ఉంది. కచ్చితంగా భవిష్యత్‌లో ఆమె భారత వెండితెరపై తిరుగులేని రాణిలా గుర్తింపు పొందుతుందని ఆదిల్‌ తెలిపాడు. టాలీవుడ్‌లో జూ.ఎన్టీఆర్‌ సరసన దేవరలో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు