శింబుతో సెట్‌ అవుతుందా?

24 Mar, 2019 12:21 IST|Sakshi

నటుడు శింబుతో నటి కల్యాణి ప్రియదర్శన్‌కు సెట్‌ అవుతుందా? ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తిగా మారిన విషయం ఇదే. శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలనాలకు కేరాఫ్‌ ఈ పేరు. జయాపజయాల విషయాన్ని పక్కన పెడితే ఈయన చిత్రాలంటేనే సంచలనం అవుతాయి. అలాంటి శింబు తాజాగా మానాడు అనే చిత్రంలో నటించబోతున్నారు. దీన్ని వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్‌ కామాక్షి నిర్మించనున్నారు.

ఈ సినిమా ప్రకటన చేసి చాలా కాలమైంది. అంతేకాదు ఆ తరువాత మానాడు ఆగిపోయిందనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. అయితే అవన్నీ వదంతులని చిత్ర వర్గాలు ఖండించారనుకోండి. మానాడు చిత్రం నిర్మాణం అవుతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇందులో శింబుకు జంటగా నటి కల్యాణి ప్రియదర్శన్‌ని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయని తాజా సమాచారం.

2013లోనే ప్రొడక్షన్స్‌ డిజైనర్‌ శాఖలో చేరిన ఈ బ్యూటీ ఆ తరువాత ఇరుముగన్‌ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ పని చేసింది. ఆ తరువాత తెలుగులో హలో చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ తరువాత మలయాళంలో, ఇటీవల తమిళంలోనూ పరిచయమైంది. అయితే మలయాళం, తెలుగులో నటించిన తొలి చిత్రాలు తెరపైకి వచ్చాయి. కోలీవుడ్‌లో మాత్రం వాన్‌ అనే చిత్రం నిర్మాణంలో ఉంది. అదేవిధంగా శివకార్తికేయన్‌కు జంటగా హీరో చిత్రంలో నటిస్తోంది.

ఇప్పుడు కోలీవుడ్‌లో శింబుకు జంటగా నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ ఇతర నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇక్కడ ఒక్క చిత్రం కూడా విడుదల కాకుండానే మూడు చిత్రాలను దక్కించుకున్న ఈ మలయాళీ బ్యూటీ ఏ మాత్రం నిలదొక్కుకుంటుందో చూడాలి. త్వరలోనే మానాడు చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని నిర్మాత సురేశ్‌కామాక్షి తెలిపారు.

మరిన్ని వార్తలు