రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కంగన టీమ్‌!

23 Oct, 2019 16:06 IST|Sakshi

కోలీవుడ్ అమ్మడు అమ‌లాపాల్ న‌టించిన తాజా చిత్రం ఆడై.. తెలుగులో ‘ఆమె’ పేరుతో రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంతగా రాణించకపోయినప్పటికీ.. కోలీవుడ్‌లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఒక ప్రత్యేక చిత్రంగా ‘ఆడై’ గుర్తింపు పొందింది. ఈ సినిమాలోని కొన్ని సీన్లలో ఒంటిమీద నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా నటించి.. పాత్రకు అమలాపాల్‌ న్యాయం చేకూర్చారు.

ర‌త్నకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం త్వరలో హిందీలో రీమేక్‌ కానుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత మహేశ్‌ భట్‌ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా హిందీ రీమేక్‌లో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ నటించనున్నారని ఊహాగానాలు చెలరేగాయి. ‘ఆడై’ సినిమాలో అమల్‌పాల్‌ పాత్ర కంగన పోషించనున్నారన్న ఊహాగానాలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఆమె ఫ్యాన్స్‌ కూడా ఈ వార్తలపై సంతోషం వ్యక్తం చేశారు.

అయితే, తాజాగా కంగనా టీమ్‌ ఈ వార్తలపై స్పందించింది. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కంగన ప్రస్తుతం తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్‌లో మాత్రమే నటిస్తున్నారని, ఇతర కొత్త ప్రాజెక్టులేమీ కమిట్‌ అవ్వలేదని, ముఖ్యంగా ‘ఆడై’  రీమేక్‌లో ఆమె నటించడం లేదని కంగన టీమ్‌ స్పష్టం చేసింది. నిజానికి ‘ఆడై’ హిందీ రీమేక్‌ మీద ఇప్పటివరకు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రాలేదు. హిందీలో ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాలని భావిస్తున్న మహేశ్‌ భట్‌.. త్వరలో ఓ ప్రకటన చేసే అవకాశముంది. హిందీలోనూ రత్నకుమారే దర్శకత్వం చేస్తారని అంటున్నారు. చిత్రయూనిట్‌ గురించి మరిన్ని వివరాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు