లండన్‌లో పరిశోధన

27 Apr, 2019 06:58 IST|Sakshi

లండన్‌ వెళ్లడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌. అదేంటీ.. లండన్‌ నుంచి వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి కాలేదుగా! మళ్లీ లండనా? అని ఆలోచనలో పడకండి. ఎందుకంటే.. కరీనా లండన్‌ నుంచి వచ్చింది సమ్మర్‌ వెకేషన్‌ కంప్లీట్‌ చేసుకుని. మళ్లీ లండన్‌ వెళ్లబోయేది ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కోసం. ఇర్ఫాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. రాజస్తాన్‌కి చెందిన మిఠాయి దుకాణం యజమానిగా ఇర్ఫాన్‌ఖాన్‌ కనిపిస్తారు. మరి.. కరీనా ఏం చేస్తారు? అంటే పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేస్తారు. అవును... ఈ సినిమాలో కరీనా పోలీసాఫీసర్‌ పాత్రలో నటించనున్నారు.

‘‘ఈ చిత్రంలో కరీనాకపూర్‌ నటించడం పట్ల మేం చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాం. ఆమె పోలీసాఫీసర్‌ పాత్రలో నటించనున్నారు. ఈ పోలీస్‌ క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుంది. జూన్‌లో లండన్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశాం’’ అని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన దినేష్‌ విజన్‌ పేర్కొన్నారు. రాజస్తాన్‌లోని మిఠాయిషాపు ఓనర్‌కి, ఓ పోలీసాఫీసర్‌కు లండన్‌లో పని ఏంటి? కరీనా లండన్‌లో చేయబోయే ఇన్వెస్టిగేషన్‌ రిజల్ట్‌ ఏమౌతుంది? అన్న విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇక 2017లో వచ్చిన ‘హిందీ మీడియం’ చిత్రానికి ‘అంగ్రేజీ మీడియం’ సీక్వెల్‌ అన్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు