ఆమెకు.. నెలకు రూ. 1.5 లక్షల జీతమా?!

11 Jan, 2020 12:44 IST|Sakshi

ముంబై: తన కొడుకు రక్షణ కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని ముఖ్యం కాదని బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ అన్నారు. బిడ్డ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటాడో వారికే అప్పగిస్తానని వ్యాఖ్యానించారు. కరీనా నటించిన తాజా చిత్రం ‘గుడ్‌న్యూస్‌’ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఓ వెబ్‌సైట్‌తో కరీనా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కరీనా తనయుడు తైమూర్‌ అలీఖాన్‌ స్టార్‌ స్టేటస్‌ గురించి మాట్లాడుతూ.. ‘ మా కుటుంబంలో వాడు సూపర్‌స్టారే.. కానీ ‘ఖాన్‌’దాన్‌లో కాదు’అని చమత్కరించారు. ఇక తైమూర్‌ కేర్‌టేకర్‌కు భారీ మొత్తంలో జీతం చెల్లిస్తున్నారట కదా అన్న ప్రశ్నకు..‘ అవునా.. నిజంగా అంత చెల్లిస్తున్నామా? ఆ విషయం గురించి మాట్లాడను’ అని బదులిచ్చారు. 

ఇక కరీనా కపూర్‌- సైఫ్‌ అలీఖాన్‌ దంపతుల గారాల పట్టి తైమూర్‌ అలీఖాన్‌ పుట్టుకతోనే సెలబ్రిటీ స్థాయి అందుకున్న సంగతి తెలిసిందే‌. స్టార్‌ కిడ్‌గా గుర్తింపు పొందిన.. ఈ చోటా నవాబ్‌ ఎక్కడ కనిపించినా కెమెరాలన్నీ అతడి వైపే తిరుగుతాయి. ఇక తైమూరు బయటికి వస్తే చాలు తైమూర్‌ చుట్టూ చేరి సెల్ఫీల కోసం జనాలు పోటీ పడుతుంటారు. అలాంటి సమయాల్లో మీడియా, ఫ్యాన్స్‌ నుంచి తైమూర్‌ని రక్షించడం కోసం నవాబ్‌ దంపతులు అతడి కోసం కేర్‌టేకర్‌ను నియమించారు. నిరంతరం తైమూర్‌ వెంటే ఉండే ఆమెకు నెలకు లక్షా ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్నారంటూ కొంతకాలంగా బీ-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏదైనా ప్రత్యేక సందర్భంలో అతడితో పాటే ఉండాల్సి వస్తే మరో 50 వేలు కూడా అదనంగా ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కరీనా పైవిధంగా స్పందించారు. ఇక ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో... ‘విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న ఈ బుల్లి రాజకుమారుడిని సంరక్షించడమంటే మాటలు కాదు కదా. సెక్యూరిటీ గార్డులు వెంట ఉన్నా ఓ అమ్మలా లాలించేందుకు, ఎల్లవేళలా అతడికి కవచంలా ఉండేందుకు ప్రయత్నిస్తున్న ఈ ‘అమ్మ’ కు ఆ మాత్రం చెల్లిస్తే తప్పేముంది’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు