మల్లూకి అతిథిగా అల్లు

11 Nov, 2018 03:16 IST|Sakshi
అల్లు అర్జున్‌, స్నేహా

అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మల్లు (మలయాళీ) అభిమానులు అల్లు అర్జున్‌ని ముద్దుగా ‘మల్లు అర్జున్‌’ అని పిలుచుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోలానే కేరళ లో కూడా అల్లు అర్జున్‌ సినిమాలు అదే స్థాయిలో సందడి చేస్తాయి. తాజాగా కేరళలో జరుగుతున్న 66వ నెహ్రూ ట్రోఫీ బోట్‌ రేస్‌కు కేరళ ప్రభుత్వం అల్లు అర్జున్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ ఈవెంట్‌కు భార్య స్నేహాతో కలసి హాజరయ్యారు బన్నీ. కేరళ గవర్నర్‌ పళనిసామి సదాశివన్‌ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మలయాళ వస్త్రధారణలో అలరించారు అల్లు అర్జున్‌. ‘‘ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, నెహ్రూ ట్రోఫీ బోట్‌ రేస్‌ను తెల్ల జెండా ఊపి, ఆరంభించే గౌరవాన్ని ఇచ్చినందుకు  కేరళ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్‌. ఇటీవలే కేరళ భారీ వరదలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బాధితులకు అల్లు అర్జున్‌ ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ చేయబోయే సినిమా డిసెంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కానుంది.
 

మరిన్ని వార్తలు