పండగలో... ‘కొత్త జంట’

24 May, 2014 23:45 IST|Sakshi
పండగలో... ‘కొత్త జంట’

 ‘‘నా దృష్టిలో డబ్బులొచ్చిన సినిమానే హిట్ సినిమా. ‘కొత్తజంట’ విడుదలై మూడు వారాలు దాటుతున్నా... ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. కుటుంబం మొత్తం చూడదగ్గ చక్కని ఎంటర్‌టైనర్‌గా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా శిరీష్‌కి మంచి సక్సెస్ ఇచ్చిన మారుతితో గీతా ఆర్ట్స్ బేనర్‌లోనే మరో సినిమా తీస్తా’’ అని అల్లు అరవింద్ అన్నారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘కొత్త జంట’. ఈ చిత్రం 25 రోజుల వేడుకను శనివారం హైదరాబాద్‌లో జరిపారు.
 
 ఈ సందర్భంగా చిత్రం సమర్పకుడు అల్లు అరవింద్ మాట్లాడారు. శిరీష్‌తో పెద్ద హిట్ తీయాలని కాకుండా, స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీయాలని ఈ చిత్రం చేశానని, తన గత చిత్రాల్లా కాకుండా, బలవంతపు వినోదం లేకుండా చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోందని మారుతి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నా కెరీర్‌కి ఇది చాలా ముఖ్యమైన సినిమా.     ఈ సక్సెస్‌తో నా బాధ్యత పెరిగింది. మంచి విజయాన్నిచ్చిన మారుతికి కృతజ్ఞతలు’’ అని అల్లు శిరీష్ అన్నారు. ఇంకా నటీనటులు శ్రుతి, మధు నందన్, రవి, హరి, ఏడిద శ్రీరామ్, ప్రవీణ్, సంగీత దర్శకుడు జేబీ, ఆర్ట్ డెరైక్టర్ రమణ తదితరులు మాట్లాడారు.