ఆ గ్యాప్ వాడేసుకుంటున్నాడు

16 Oct, 2015 14:43 IST|Sakshi
ఆ గ్యాప్ వాడేసుకుంటున్నాడు

దసరా బరిలో భారీగా రిలీజ్ అవుతుందని భావించిన 'అఖిల్' సినిమా వాయిదా పడటంతో ఆ గ్యాప్ను వాడుకోవడానికి రెడీ అయ్యాడు మెగా హీరో వరుణ్ తేజ్. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమాను అక్టోబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ మేరకు తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో మెసేజ్ పోస్ట్ చేశాడు.

ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించినా... పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేసుకున్నారు.  ఆ తరువాత ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయంలో ఎలాంటి ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. తాజాగా అక్టోబర్ 22న రిలీజ్ కావాల్సిన 'అఖిల్' వాయిదా వేస్తున్నట్టుగా నితిన్ ప్రకటించటంతో ఆ గ్యాప్ లో 'కంచె' రిలీజ్ చేస్తే పండుగ సెలవులను క్యాష్ చేసుకోవచ్చని, అదే రోజు రిలీజ్ ప్లాన్ చేశారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగే ప్రేమకథగా 'కంచె' సినిమాను తెరకెక్కించారు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.