పెళ్లి వార్తలపై ఫిర్యాదు

18 Mar, 2020 04:15 IST|Sakshi

‘హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠిని వివాహం చేసుకుని, ఆపై వదిలేశా’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా శ్రీరామోజు సునిశిత్‌ అనే వ్యక్తి ఓ దుమారం రేపారు. సునిశిత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కథానాయిక లావణ్యా త్రిపాఠి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరామోజు సునిశిత్‌ అనే వ్యక్తి కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారామె. లిఖితపూర్వక ఫిర్యాదును ఆమె తన సహాయకుడి ద్వారా ఏసీపీ కేవీఎమ్‌ ప్రసాద్‌కు అందజేశారు. ఈ విషయంపై ఏసీపీ కేవీఎమ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీరామోజు సునిశిత్‌ అనే వ్యక్తి లావణ్య ఒక్కరిపైనే కాదు.. చాలా మంది సెలబ్రిటీలపైనా లేనిపోని వ్యాఖ్యలు చేశాడు.. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. లావణ్యా త్రిపాఠి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నాం. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదు’’ అన్నారు.

మరిన్ని వార్తలు