‘మా’లో మరో కొత్త  వివాదం..

20 Oct, 2019 11:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నరేశ్‌ అధ్యక్షతన ఏర్పడిన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)’కొత్త కార్యవర్గం సభ్యల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.. కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే కార్యవర్గ సభ్యుల మధ్య అంతరాలు పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అధ్యక్షుడు నరేశ్‌, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ మధ్య తీవ్రస్థాయిలో వివాదం నెలకొందని, అంతేకాకుండా నరేశ్‌కు షోకాజ్‌ నోటీసుల ఇవ్వాలని రాజశేఖర్‌ కార్యవర్గం సిద్దపడిందని అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ‘మా’ తీవ్రంగా ఖండించింది. అయితే ఆదివారం ‘మా’లో జరుగుతున్న నాటకీయ పరిణామాలను చూస్తే అధ్యక్షుడు నరేశ్‌కు రాజశేఖర్‌ కార్యవర్గం మధ్య వివాదం తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

‘మా’  సభ్యుల మీటింగ్‌ ఉందంటూ జీవితా రాజశేఖర్‌ మెస్సేజ్‌ ఇవ్వడం  నరేశ్‌ కార్యవర్గానికి షాక్‌కు గురిచేసింది. అయితే కోర్డు ఆర్డర్‌ ప్రకారం ఇది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్‌ తెలిపారు. అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్‌ ఎలా పెడతారని నరేశ్‌ తరుపు లాయర్‌ ప్రశ్నిస్తున్నారు. దీంతో కాసేపట్లో మీటింగ్‌ ప్రారంభం కానుండటంతో అందిరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ఫండ్స్‌ కలెక్ట్‌ చేయలేదని, చాలా రోజుల నుంచి నరేశ్‌ మీటింగ్స్‌కు రావడం లేదని రాజశేఖర్‌ కార్యవర్గం ఆరోపిస్తోంది. అంతేకాకుండా ‘మా’ కు రాజశేఖర్‌ భారీ విరాళం ఇవ్వడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 

ఆ ఐదున్నర కోట్లు ఏమయ్యాయి?
మా కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలల అవుతున్నా ఇప్పటివరకు ఫండ్స్‌ కలెక్ట్‌ చేయలేదని ఆధ్యక్షుడు నరేశ్‌పై రాజశేఖర్‌ కార్యవర్గం గుర్రుగా ఉంది. అంతేకాకుండా మా లో ఉన్న మూల ధనం రూ. 5.5 కోట్లు ఏమయ్యాయని అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నారు. గతంలో మూల ధనాన్ని కదపకుండా ఈవెంట్స్‌ స్పాన్లర్ల ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేసిందని, కానీ నరేశ్‌  మూలధనం నుంచే ఖర్చులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రోజు ‘మా’లో ఏర్పడిన పరిస్థితిక నరేశే కారణమంటూ జీవిత రాజశేఖర్‌ కార్యవర్గం మండిపడుతోంది.

‘మా’గౌరవాన్ని కాపాడుదాం
కోర్డు ఆర్డర్‌ ప్రకారం ఇది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని ‘మా’ చీఫ్‌ అడ్వైజర్‌ కృష్ణంరాజు తెలిపారు. అంతేకాకుండా ఈ మీటింగ్‌కు వచ్చిన వారి చేత ఎలాంటి సంతకాలు పెట్టించమన్నారు. ఒకవేళ సంతకాలు పెట్టిదలచిన వారు పూర్తిగా విషయం గురించి చదివి సరియైనది అని భావిస్తేనే సంతకం పెట్టాలన్నారు. ఏ నిర్ణయమైనా అందరూ కలిసి చర్చించుకుని తీసుకోవాలన్నారు. 25 ఏళ్ల చరిత్ర కలిగిన ‘మా’ ఇప్పటివరకు అందరూ మెచ్చుకునేలా ఉందని, ఇకపై కూడా అలాగే గౌరవంగా ఉండాలని ఆశిస్తున్నట్లు కృష్ణంరాజు తెలిపారు. 

మరిన్ని వార్తలు