ఆ నలుగురూ ముఖ్యులు

15 Jan, 2019 00:23 IST|Sakshi
అంజలి, మాధవన్‌, అనుష్క, షాలినీ పాండే

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి పేరున్న నటుడు మాధవన్‌. ‘బాహుబలి’ ముందు వరకూ అనుష్క దక్షిణాది వరకే పరిమితం. ఆ సినిమా తర్వాత ఉత్తరాదిన కూడా పేరు తెచ్చుకున్నారు. తెలుగమ్మాయి అంజలికి సౌత్‌లో మంచి పేరుంది. ఇక ‘అర్జున్‌రెడ్డి’తో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు షాలినీ పాండే. ఈ నలుగురూ ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అమెరికాలో జరిగే షూటింగ్‌తో ప్రారంభం కానుంది. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.

టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో తీయనున్నామని చిత్రనిర్మాతలు తెలిపారు. అలాగే  తెలుగు, తమిళ, హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తారు. తొలి క్రాస్‌ ఓవర్‌ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజులు ముఖ్య పాత్రలు చేస్తారు. కోన  వెంకట్, షనిల్‌ డియో, గోపీ మోహన్, నీరజ కోన, గోపీసుందర్‌ టెక్నీషియన్లుగా చేయనున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. మార్చిలో ప్రారంభం అయ్యే ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు