మనసి చిత్ర గీతాలావిష్కరణ

15 Apr, 2016 03:18 IST|Sakshi
మనసి చిత్ర గీతాలావిష్కరణ

మానసి చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఎంఎం థియేటర్‌లో జరిగింది. మూవీ మోషన్స్, ఎంజే.ఫిలింస్ అధినేతలు ఏ.పాహిమ్ ముహ్మదు, మాథ్యూజోసెఫ్‌లు నిర్మిస్తున్న చిత్రం మనసి. నవ జంట నరేశ్‌కుమార్, హారిస హీరోహీరోయిన్లుగా నటిస్తునారు. నటి హారిస ఇప్పటికే మలయాళంలో రెండు మూడు చిత్రాలలో నటించింది. తమిళంలో ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతోంది. ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో తవసి, లనూప్‌సతీషన్, సల్మాన్, పృథ్వీ, కేశవ్, ఆశిక్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ దర్శకులు కమల్, ఫాజిల్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన నవాజ్‌సులేమాన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

శివరామ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ఒక గొర్రెల కాపరి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. ఆ యువకుడు గొర్రెలను తన ఆత్మబంధువులుగా భావిస్తాడన్నారు. ఎవరికీ చెడు తలపెట్టని మూగ జీవులంటే అతనికి అంత ప్రేమ అన్నారు. అలాంటిది అందులో ఒక గొర్రె కనిపించకుండా పోయి ఆ యువకుడిని బాధకు గురి చేస్తుందన్నారు. అసలు ఆ గొర్రె ఏమయ్యింది, మళ్లీ తిరిగి వచ్చిందా? అన్న అంశాలను కమర్షియల్ రీతిలో చిత్రంగా మలచినట్లు తెలిపారు. చిత్రాన్ని తేని, కంభం, ఉత్తమపాళైయం, బోడి, ఉత్తుక్కాడు, కొంభై తదితర ప్రాంతాలలో చిత్రీకరించినట్లు దర్శకుడు వెల్లడించారు.