‘చిన్నప్పుడే అమ్మకు ఫ్యాషన్‌లో సలహాలు ఇచ్చేవాడిని’

29 Feb, 2020 21:03 IST|Sakshi

సెలబ్రెటీ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌ తారలు శ్రీదేవి నుంచి ఇప్పటీ యువ తారల సినిమాలకు ఎన్నో రకాల డిజైనర్‌ డ్రెస్‌లను అందింస్తూ తేరపై వారి అందాన్ని మరో లెవల్‌కు చేరుస్తారు. అంతేగాక అంతర్జాతీయంగా ఫ్యాషన్‌ షోలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మనీష్‌ మల్హోత్రా. ఇక ఎప్పుడు బిజీగా ఉండే ఆయన తాజాగా హ్యూమన్‌ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఫ్యాషన్‌ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ స్థాయికి చేరడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, పంజాబీ కుటుంబంలో జన్మించిన తనకు ఫ్యాషన్‌ పట్ల, బాలీవుడ్‌ సినిమాలపై చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేదన్నారు. అంతేగాక డిజైనర్‌గా ఎదగాడానికి ఆయన తల్లి సహాకారం కూడా ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. డిజైనర్‌గా అగ్రస్థానంలో ఉన్న మనీష్‌ సినీ పరిశ్రమలో ఫ్యాషన్‌ డిజైనర్‌గా 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. ‘చిన్నప్పటీ నుంచే నాకు ఫ్యాషన్‌తో పాటు బాలీవుడ్‌ సినిమాలంటే పిచ్చి. నిజం చెప్పాలంటే ఆ పిచ్చే నన్ను ఈ స్థాయికి చేర్చింది. ఇక ఫ్యాషన్‌పై ఇష్టంతో చదువుపై పెద్దగా శ్రద్ద చూపలేదు. ఇక నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఓ పెయింటింగ్‌ క్లాస్‌కు వెళ్లాను. అది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ క్లాస్‌ బాగా నచ్చింది.  దానిని నేను బాగా ఎంజాయ్‌ చేశాను. ఇక సినిమాలలోని హీరో, హీరోయిన్లు ధరించిన దుస్తులను చూసి మా అమ్మ చీరలు, డ్రెస్‌లతో ప్రయోగాలు చేసేవాడిని’ అని మనీష్‌ చెప్పారు.

‘అలా నాకు ఫ్యాషన్‌ పట్ల మరింత ఆసక్తి పెరిగింది. ఎంతగా అంటే.. తరచూ మా అమ్మకు నేను ఫ్యాషన్‌ గురించి సలహాలు ఇస్తూ ఉండేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. కాలేజీలో చేరినప్పుడు బొటిక్‌లో పనిచేస్తూ.. మోడలింగ్‌ చేయడం ప్రారంభించాను. అలా ఏడాదిన్నారపాటు ఆ బొటిక్‌లో పని చేశా. అప్పుడు నాకు నెలకు రూ.500 జీతం వచ్చేది. దాన్ని నేను చాలా విలువైనదిగా భావించేవాడిని. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో అధ్యయనం చేయడం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ ఆర్థిక కారణాల వల్ల విదేశాలకు వెళ్లలేకపోయాను. ఇక నా సొంతంగా ఓ స్కూల్‌ పెట్టి క్లాస్‌లు చెబుతూ.. గంటల తరబడి స్కెచ్‌ డిజైన్స్‌ గీస్తూ ఉండేవాడిని’ అంటూ వివరించారు. ఈ క్రమంలో తన 25వ ఏటా జూహీ చావ్లా సినిమాకు డిజైనర్‌గా పనిచేసే అవకాశం వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత 1995లో వచ్చిన అమీర్‌ఖాన్‌, ఊర్మీళ, జాకీర్‌ ష్రాఫ్‌ల ‘రంగీలా’ డిజైనర్‌గా పని చేసినందుకు మొదటి ఫీలింఫేర్‌ ఆవార్డు అందుకున్నట్లు ఆయన చెప్పారు.

‘అలా ఎన్నో సినిమాలకు పని చేస్తూ.. ఫ్యాషన్‌ షోలో భాగంగా ప్రపంచమంత తిరిగేవాడిని. ఈ నేపథ్యంలో 2005లో నా సొంతంగా ఫ్యాషన్‌ లాబెల్‌ను ప్రారంభించాను. అలా ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగాను’ అంటూ ఫ్యాషన్‌పై తనకున్న ఇష్టాన్ని తెలిపారు. ఈ స్థాయికి చేరడంమంటే సాధారణ విషయం కాదని, ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కోని సమస్యలను అదిగమిస్తేనే మనం అనుకున్న స్థాయికి చేరగలమన్నారు. ఇక బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నాలుగో తరం నటి, నటులతో పనిచేస్తున్న మనీష్‌ .. ఈ ఏడాదితో పరిశ్రమలో ఫ్యాషన్‌ డిజైనర్‌గా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఫ్యాషన్‌ షో ఇచ్చేముందు భయపడతానని తెలిపారు. నేన ఈ   స్థాయికి ఎలా వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను.. అనే విషయాలను నేను మర్చిపోలేనని చెబుతూ తన నిరాంబరతను చాటుకున్నాడు మనీష్‌ మల్హోత్రా.

మరిన్ని వార్తలు