మన బిడ్డ రూపంలో నిన్ను తీసుకొస్తా!

19 Jun, 2020 05:43 IST|Sakshi
మేఘనా రాజ్, చిరంజీవి సర్జా

‘‘నా చిరూ.. ఎప్పటికీ నువ్వు నా చిరూవే. నీ గురించి చాలా చాలా చెప్పాలని ఉంది. ప్రపంచంలో ఎన్ని పదాలు ఉన్నా నువ్వు నాకెంత ముఖ్యమో చెప్పడానికి సరిపోవడంలేదు. నా స్నేహితుడు, నా ప్రేమికుడు, నా భాగస్వామి, నా కుమారుడు, నా ఆత్మవిశ్వాసం, నా భర్త... వీటన్నింటికంటే నువ్వు నాకు చాలా ఎక్కువ’’ అంటూ మేఘనా రాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త చిరంజీవి సర్జాని ఉద్దేశించి ఓ పోస్ట్‌ పెట్టారు.  నటుడు అర్జున్‌ మేనల్లుడు, హీరో చిరంజీవి సర్జా రెండు వారాల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. 2018లో చిరంజీవి సర్జా, కథానాయిక మేఘనా రాజ్‌ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మేఘనా నాలుగు నెలల గర్భవతి. గురువారం తన మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారామె. ‘‘నా ఆత్మలో నువ్వు సగభాగం.

నేను తలుపువైపు చూసిన ప్రతిసారీ ‘ఇంటికొచ్చేశా’ అంటూ నువ్వు అరవడం చూడాలనుకుంటా.. కానీ ఎక్కడ? నిన్ను ఇక ఎప్పటికీ తాకలేను అనే ఫీలింగ్‌ నా హృదయాన్ని ముక్కలు చేస్తోంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మన ప్రేమకు ఓ చిహ్నం. ఈ బిడ్డ రూపంలో నిన్ను ఈ భూమ్మీదకు తీసుకురావడానికి ఆసక్తిగా ఉన్నాను. నీ చిరునవ్వుని వినడానికి ఎదురు చూస్తున్నా. నేను శ్వాసించినంత కాలం నువ్వు బతికే ఉంటావ్‌. నువ్వు నాలో ఉన్నావ్‌. ‘ఐ లవ్‌ యు’’ అంటూ భర్తతో ఉన్న ఈ ఫొటోను షేర్‌ చేశారు మేఘనా రాజ్‌. తెలుగులో బెండు అప్పారావు, లక్కీ తదితర చిత్రాల్లో నటించిన  మేఘనా.. చిరంజీవి సర్జాతో ‘ఆటగార’, ‘రామ్‌లీలా’ వంటి చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు.

మరిన్ని వార్తలు