విజయానందంలో మరగదనాణియం

27 Jun, 2017 03:22 IST|Sakshi
విజయానందంలో మరగదనాణియం

తమిళ సినిమా: మరగదనాణియం చిత్ర యూనిట్‌ విజయానందంలో మునిగి పోయింది. యాక్సస్‌ ఫిలింస్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఢిల్లీబాబు నిర్మించిన చిత్రం మరగదనాణియం. ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన ఈ చిత్రానికి ద్రార సరవణ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆనందరాజ్, ముండాసుపట్టి రామ్‌దాస్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం గత వారంలో తెరపైకి వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చెన్నైలో చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది.

ఇందులో చిత్ర నిర్మాత ఢిల్లీబాబు మాట్లాడుతూ ఉరుమీన్‌ తరువాత తన సంస్థ నిర్మించిన తాజా చిత్రం మరగదనాణియం అన్నారు. ఒక కమర్షియల్‌ హీరోగా ఎదుగుతున్న ఆది ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారేమిటన్న భావన తనకు కలిగిందన్నారు. అదే విధంగా నటి నిక్కీగల్రాణి మగగొంతుతో మాట్లాడే పాత్రలో నటించి మెప్పించారన్నారు.

ఇది సాధారణ హీరోహీరోయిన్ల ప్రేమ, ఐటమ్‌ సాంగ్స్‌లతో కూడిన చిత్రం కాదని చిత్ర హీరో ఆది అన్నారు. నిజం చెప్పాలంటే తాను లేకపోయినా ఈ చిత్ర విజయం సాధ్యం అవుతుందేమోగాని, ముండాసుపట్టి రామ్‌దాస్‌ తదితర పాత్రదారులు లేక పోతే సాధ్యం కాదన్నారు. ఆ పాత్రలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం, యూనిట్‌ మొత్తం నిజమైన శ్రమనే ఈ చిత్ర విజయానికి కారణంగా ఆది పేర్కొన్నారు. ఈ చిత్రం తెలుగులోనూ విజయవంతంగా సాగుతుండడం విశేషం. 

>