నంబర్‌ 1 ఎవరు?

6 Nov, 2018 02:01 IST|Sakshi
రామకృష్ణ, వెంకటేశ్వర రావు, భాస్కర్, ధర్మతేజ

రాజ్‌ వాడపల్లి, వంశీ కృష్ణ, ప్రియా అగస్టీన్, కావ్యకీర్తి బండారి ముఖ్య తారలుగా కుమార్‌ రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మొనగాడెవరు’. ‘హు ఈజ్‌ నెం.1’ అన్నది ట్యాగ్‌ లైన్‌. వాడపల్లి జగన్నాథం సమర్పణలో మెగా ఆర్ట్స్‌ బ్యానర్‌పై వాడపల్లి రాజు, దావల రాజ్‌కిరణ్‌ నిర్మిస్తున్న ఈ  సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్‌ బి.గోపాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు శివాజీ రాజా క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ గౌరవ దర్శకత్వం వహించగా, మరో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ లోగో లాంచ్‌ చేశారు.

కుమార్‌ రాజేంద్ర మాట్లాడుతూ– ‘‘హీరోయిన్లు కావాలని ఇద్దరు అమ్మాయిలు, డైరెక్టర్‌ అవ్వాలని ఓ కుర్రాడు, హీరో కావాలని మరో యువకుడు సిటీకొస్తారు. ఇండస్ట్రీలో ఎదగడం అంత సులభం కాదని తెలుసుకుని ఎలా కష్టపడ్డారు? చివరకు సక్సెస్‌ సాధించారా? అనేదే కథ. సినిమాల్లో ఇప్పటివరకు నటించిన, నటిస్తున్న ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఏ విధంగా ఎదిగారనే అంశాలు (బయోపిక్స్‌) చూపించనున్నాం’’ అన్నారు. ‘‘సినిమా వాళ్ల కష్టాలను మా చిత్రంలో చూపిస్తాం. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాల్లో సగభాగాన్ని పేద సినీ కళాకారులకు అందిస్తాం’’ అని వాడపల్లి రాజు, దావల రాజ్‌కిరణ్‌ అన్నారు. హేమ సుందర్, ‘బస్టాప్‌’ కోటేశ్వర్‌ రావు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్‌.రాజు, కెమెరా: ఎం.మురళి.

మరిన్ని వార్తలు