ఓంకార్‌కి ఓ దండం పెట్టా: నాగార్జున

12 Oct, 2017 21:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజుగారి గది-2 సినిమా బాగా వచ్చిందని, క్లైమాక్స్‌లో సమంత నటన సూపర్‌ అని అక్కినేని నాగార్జున ప్రశంసించారు. నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆయన మెంటలిస్ట్‌ పాత్రలో నటించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్‌ గురువారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..రాజుగారి గది-2 సినిమా తనకు చాలా స్పెషల్ అని అన్నారు. నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత వస్తున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ కావాలని ఆయన ఆకాంక్షించారు.

‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. పెళ్లి అయిన తర్వాత  కోడలు సమంత ఒక హిట్ తీసుకొచ్చిందని అనుకునేలా ఉండాలి. అది తప్పకుండా వస్తుందని గొప్ప నమ్మకం. సినిమా మీద నాకు బాగా కాన్ఫిడెన్స్‌ ఉన్నప్పుడల్లా చెబుతుంటాను... అలాగే మళ్లీ వస్తున్నాం... మళ్లీ హిట్‌ కొడుతున్నాం. ఇక దర్శకుడు ఓంకార్‌కు  ఓసీడీ ఉంది.  సినిమా మీద అతడికి విపరీతమైన ప్రేమ. అనుకున్నది  కరెక్ట్‌గా వచ్చేవరకూ అందర్ని చంపాడు. నేను సాధారణంగా ఎప్పుడు చిరాకు పడను. అలాంటిది నేను కూడా అతడి మీద చిరాకుపడ్డాను. చివరి రోజు షూటింగ్‌ అయిపోయాక నీకో దండం అయ్యా బాబు అని...ఓంకార్‌కు చెప్పాను. చిత్ర యూనిట్‌ అంతా ఓ టీమ్‌గా పనిచేసింది. ఆ శ్రమకు తగిన ఫలితం సినిమా రిలీజ్‌ అయిన తర్వాత కనిపిస్తుంది’  అని నాగార్జున అన్నారు.

>
మరిన్ని వార్తలు