సోగ్గాడు బిజీ బిజీ

4 Feb, 2015 23:49 IST|Sakshi
సోగ్గాడు బిజీ బిజీ

హీరో నాగార్జున పేరు చెబితే, ఇప్పుడు అందరికీ బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమం గుర్తొస్తోంది. అతి కొద్దిరోజుల్లోనే అందరినీ ఆయనకు అభిమానుల్ని చేసిన టీవీ షో అది. ఒకపక్క ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న నాగార్జున కొద్దికాలం విరామం తరువాత ఇప్పుడు సినిమా షూటింగ్‌లోనూ బిజీగా పాల్గొంటున్నారు. అందరినీ ఆకట్టుకున్న నిరుటి ‘మనం’ తరువాత ఇప్పుడు ఆయన ఏకంగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే పేరు ప్రచారంలో ఉంది.

ప్రతిభావంతులైన కొత్తవాళ్ళను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున అదే పద్ధతి కొనసాగిస్తూ, ఈ చిత్రంతో కల్యాణ్‌కృష్ణ అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, పరిసరాల్లో దాదాపు 20 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంది. వచ్చేవారం నుంచి దాదాపు నెల నుంచి నెలన్నర దాకా హైదరాబాద్ పరిసరాల్లోనే తదుపరి షెడ్యూల్ జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు భోగట్టా. ఈ ప్రధానమైన షెడ్యూల్‌లో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నారని సమాచారం.

ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ కథానాయికలు. బ్రహ్మానందం, ఝాన్సీ, హంసానందిని తదితరులు ఇతర తారాగణం. గత ఏడాది కాలంగా మంచి జోరు మీదున్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. అన్నట్లు, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక భాగాలను ఇతర రాష్ట్రాలలో చిత్రీకరించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట! అందుకోసం తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో కూడా లొకేషన్ల అన్వేషణ జరుగుతోంది. ఒకప్పటి అక్కినేని హిట్ గీతం పల్లవిలోని మాటలనే పేరుగా పెట్టుకొన్న ఈ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వివరాలు అధికారికంగా త్వరలో తెలుస్తాయి.