5 నుంచి 8కి పెంచేసింది 

21 Nov, 2019 10:11 IST|Sakshi

నయనతార హవా కొనసాగుతోందనడానికి మరో ఉదాహరణ ఇది. తెలుగులో సైరా, తమిళంలో బిగిల్‌ విజయాలతో కొత అవకాశాలు తలుపు తడుతున్నాయి. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్‌ పెంచిందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలకు ఐదు కోట్ల వరకు పారితోషకం పుచ్చుకున్నట్లు టాక్‌. దాన్ని తాజాగా 8కి పెంచేసినట్లు సమాచారం. నయనతారకు ఉన్న క్రేజ్‌తో నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఇలా తమ సినిమాల్లో నటించమని అడిగిన ప్రొడ్యూసర్లపై నయనతార భారీ పారితోషకమనే బిగ్‌ బాంబ్‌ వేసినట్లు తెలుస్తోంది. అయితే భారీగా పారితోషకం పెంచినప్పటికీ తమ సినిమాలో నయనతారే నటించాలని కొంతమంది దర్శక నిర్మాతలు పట్టుబడుతున్నారట. ఎందుకంటే నయనతారకు ఉన్న క్రేజ్‌ అటువంటిది.  

ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా నటిస్తున్న దర్బార్‌ చిత్రాన్ని పూర్తి చేసిన నయనతార ప్రస్తుతం తన ప్రియుడు, దర్శకుడు విఘ్నశ్‌ శివన్‌ను నిర్మాతగా చేసి నెట్రికన్‌ అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపేసింది. ఆర్‌జే.బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ముక్కుత్తి అమ్మన్‌ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది భక్తిరస కథా చిత్రంగా ఉంటుందని ఆర్‌కే.బాలాజీ ఇటీవల వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే ఇందులో నయనతార అవకాశం అడిగి మరీ నటించనుందట. ఈ విషయాన్ని ఆర్‌జే.బాలాజీనే తెలిపారు. తన కథను రెడీ చేసుకుని కొందరు సినీ ప్రముఖులకు వినిపించారట. అందులో దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కూడా ఉన్నాడట. ఆయన ఈ కథ గురించి నయనతారకు చెప్పడంతో ఆమె వెంటనే ఆర్‌జే.బాలాజీకి ఫోన్‌ చేసి ఏమిటీ ఎవరెవరికో కథ వినిపిస్తున్నావట. నాకు చెప్పవా?అని అడిగారని బాలాజీ తెలిపారు.

అలా కథను చెప్పించుకుని మరీ అవకాశాన్ని పొందిన నయనతార ఈ చిత్రానికి 8 కోట్లు పారితోషికాన్ని డిమాండ్‌ చేసిందనేది తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంత పారితోషకాన్ని ఆమెకు ముట్ట జెప్పడానికి చిత్ర నిర్మాత సమతించినట్లు సమాచారం. ఇంతకీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది ఏవరో తెలుసా? వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత ఐసరిగణేశ్‌. చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం తన పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసుకోవడానికి ప్రియుడితో కలిసి న్యూయార్క్‌ చెక్కేసిన నయనతార తిరిగి రాగానే ముక్కుత్తి అమ్మన్‌ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రం తరువాత కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మించనున్న చిత్రంలోనూ నటించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు