మీటూ మార్పు తెచ్చింది

25 Oct, 2019 00:10 IST|Sakshi
పూజా హెగ్డే

‘‘మీటూ’ ఉద్యమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక నటిగా, స్త్రీగా నా అభిప్రాయమేంటంటే.. ఈ ఉద్యమాన్ని తేలికగా తీసుకోకూడదు. ‘మీటూ’ వల్ల చిత్ర పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైనది కూడా.  బయటకు వచ్చి ఈ విషయాలను చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. బాధితులందరి ధైర్యాన్ని అభినందిస్తున్నాను’’ అని ‘మీటూ’ మూమెంట్‌ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్‌ 4’ ప్రమోషన్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు పూజా.

అక్షయ్‌కుమార్, సన్నీ డియోల్, పూజా హెగ్డే, రానా, కృతీ సనన్, కృతీ కర్భందా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ముందుగా ఈ చిత్రానికి సాజిద్‌ ఖాన్‌ దర్శకుడు. దాదాపు 70 శాతం సినిమాని కూడా పూర్తి చేశారు. అయితే ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రీకరణలో ఉండగానే, ఆయన  మీద ‘మీటూ’ ఆరోపణలు రావడంతో దర్శకుడిగా తప్పించారు. ఆ విషయం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘సినిమా జరుగుతున్న సమయంలో దర్శకుడిని తప్పించడమంటే సినిమాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ నిర్మాణ సంస్థ ఆ ఇబ్బంది ఏం తెలియనివ్వలేదు. ఈ చిత్ర కథా రచయిత ఫర్హాద్‌ సమ్‌జీను దర్శకుడిగా నియమించింది’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు