ప్రభాస్‌గారూ.. మా థియేటర్‌కు రండి!

3 Apr, 2016 18:14 IST|Sakshi
ప్రభాస్‌గారూ.. మా థియేటర్‌కు రండి!

ముంబై: 'బాహుబలి' విజయగాథ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం ఈ చిత్రానికి దక్కడంతో 'బాహుబలి'కి ఉన్న క్రేజ్‌ మరింత పెరిగింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వివిధ భాషల్లో ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. దీంతో చాలామంది థియేటర్‌ యజమానులు 'బాహుబలి' ప్రభాస్‌కు లేఖలు రాస్తున్నారు. 'మా థియేటర్‌కు ఒక్కసారి వచ్చి వెళ్లండి. మా ప్రేక్షకులకు నిజమైన నిజమైన 'బాహుబలి' ఎలా ఉంటాడో కనిపించి వెళ్లండి' అని థియేటర్ యజమానులు ప్రభాస్‌ను  కోరుతున్నారు.

దేశంలోని చాలాచోట్ల ఈ సినిమా థియేటర్లలో మ్యాట్నీషో ఆడుతోంది. దీంతో ఆయా థియేటర్ల యజమానులు పలువురు తమ థియేటర్‌కు ఒక్కసారి వచ్చివెళ్లండంటూ ప్రభాస్‌కు విజ్ఞప్తులు చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ప్రభాస్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ''బాహుబలి' సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఇది ఎంతో ఆనందం కలిగిస్తోంది. సినీ పరిశ్రమలో థియేటర్ల యజమానులు కూడా భాగమే. వారి నుంచి ఈ స్పందన రావడం ఎంతో గొప్ప విషయం' అని ప్రభాస్‌ పేర్కొన్నాడు.