బెదిరింపులతో ఓటర్‌ని ఆపలేరు

21 Jun, 2019 00:59 IST|Sakshi
ప్రశాంత్‌ గౌడ్‌

‘‘ఓటర్‌’ సినిమా విడుదల కాకుండా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాని ఆపాలని బెదిరిస్తున్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆపేది లేదు. అనుకున్న ప్రకారం నేడు విడుదల చేస్తున్నాం’’ అన్నారు ప్రశాంత్‌ గౌడ్‌. మంచు విష్ణు, సురభి జంటగా నటించిన చిత్రం ‘ఓటర్‌’. కార్తీక్‌ దర్శకత్వంలో జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్‌ అవుతోంది. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో అడ్వకేట్‌ వేణుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో జాన్‌ సుధీర్‌ పూదోట, కార్తీక్‌పై 24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ కోర్టులో కేసు వేసింది.

సినిమాని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. సినిమా విడుదల విషయంలో అభ్యంతరం చెప్పకుండా కోర్టు ఆర్డర్‌ కూడా ఇచ్చింది’’ అన్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్త థియేట్రికల్‌ హక్కులను సొంతం చేసుకున్న ప్రశాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘12ఏళ్లుగా  డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా ఉన్నాను. నాపై ఇప్పటివరకూ ఎలాంటి వివాదాలు లేవు. ఓటర్‌ విలువ చెప్పే చిత్రం ఇది. ఈ పాయింట్‌ నచ్చి కొనుక్కున్నా. లీగల్‌గా విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌తో ఉన్న పరిచయాలతో సినిమాని విడుదల చేస్తున్నా’’ అన్నారు.

మరిన్ని వార్తలు