ప్రభుత్వం దృష్టికి చిత్రపురి సమస్యలు

11 Jul, 2019 01:57 IST|Sakshi
సినీ కార్మికుల దీక్షలో ప్రతాని

– ప్రతాని రామకృష్ణ గౌడ్‌  

‘‘చిత్రపురి కాలనీలో 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న సినీ కార్మికులకు కాకుండా సినిమాయేతరులకు ఇళ్లు కేటాయించారు. సుమారు 5 వేలకుపైగా నిజమైన సినీకార్మికులకు ఇళ్లు కేటాయించాల్సి ఉంది. దీనికోసం ‘చిత్రపురి పోరాట సమితి’ చేస్తున్న దీక్షల్లో న్యాయం ఉంది’’ అని తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ అన్నారు. చిత్రపురి కాలనీలో ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీ కార్యవర్గ సభ్యుల అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ‘చిత్రపురి పోరాట సమితి’ ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్షకు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ బుధవారం మద్దతు పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘26 రోజులుగా దీక్షలు చేపడుతున్నా హౌస్‌ంగ్‌ సొసైటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

సినీ కార్మికులకు ఇచ్చిన స్థలాన్ని ‘కైరోస్‌ గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’కి కేటాయించడం చట్ట విరుద్ధం, వెంటనే ఆ స్కూల్‌ను తొలగించాలి. ఈ సొసైటీలో జరిగిన అవకతవకలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం కేటాంచబోయే 9 ఎకరాలను ‘చిత్రపురి పోరాట సమితి’కి  కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతాం’’ అన్నారు. కాగా ధర్నాలో పాల్గొంటున్నారనే కారణంతో షూటింగ్‌లకు పిలవని కొందరు సినీ కార్మికులకు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ బియ్యం వితరణ చేశారు. ‘‘న్యాయం కోసం పోరాటం చేసే వారిని బెదిరిస్తున్నారని, ఎవరు బెదిరించినా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’’ అని ‘చిత్రపురి పోరాట సమితి సభ్యుడు’, డైరెక్టర్‌ కస్తూరి శ్రీనివాస్‌ అన్నారు. బి నరసింహా రెడ్డి, మహేందర్, ఓ. రవిశంకర్, మురళితో పాటు పలువురు సినీకార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు