ఆయన చుట్టూ మందీ మార్బలం లేరు.. ఎవరికీ ముందస్తు సమాచారం లేదు... సామాన్య భక్తుల్లో ఒకరిగా, సడన్గా మంగళవారం ఉదయం మంత్రాలయంలో ప్రత్యక్షమయ్యారు రజనీకాంత్. ఆయనకు రాఘవేంద్ర స్వామి అంటే ఎంత భక్తి అనేది అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడూ కర్నూల్లోని మంత్రాలయంలో గల ఆలయానికి వచ్చి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటుంటారు రజనీ. మంగళవారం కూడా అలానే వచ్చి, తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన రజనీకి స్వామివారి జ్ఞాపిక, శేష వస్త్రం, ప్రసాదాలు అంద జేశారు. మఠాధికారులు రజనీని పూర్ణకుంభంతో ఆహ్వానించారు. స్వామివారి కరుణాకటాక్షంతోనే సినిమా రంగంలో ఈ స్థాయికి చేరుకున్నాన ని రజనీ పేర్కొన్నారు. అన్నట్లు... రజనీ ‘శ్రీ రాఘవేంద్రర్’(తెలుగులో ‘శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం’)లో టైటిల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.