ఒకే చిత్ర నిర్మాణ సంస్థలో మామాఅల్లుళ్లు

11 Apr, 2016 03:44 IST|Sakshi
ఒకే చిత్ర నిర్మాణ సంస్థలో మామాఅల్లుళ్లు

మామా అల్లుళ్లు ఒకే చిత్ర నిర్మాణ సంస్థలో నటించడం విశేషం కాక పోయినా అరుదైన విషయమే అవుతుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్‌ల విషయంలో అలాంటి అరుదైన విషయం జరగడం గమనార్హం. రజనీకాంత్ దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 2.ఓ. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా యాడ్ అవడంతో మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఈ భారీ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే నటుడు ధనుష్ హీరోగా వడచెన్నై చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. బాహుబలి చిత్రం తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నారు. విచారణై వంటి జాతీయ అవార్డును కొల్లగొట్టిన చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహించనున్న వడచెన్నై చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించనున్నారు.

తంగమగన్ చిత్రం తరువాత ఈమె ధనుష్‌లో నటించడానికి సిద్ధమవుతున్న ఈ వడచెన్నై చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించనుందని ఆ సంస్థ నిర్వాహకుడు రాజూమహాలింగం వెల్లడించారు.ఆయన తెలుపుతూ లైకా సంస్థ ధనుష్ నటించిన తాజా చిత్రం కొడి పంపిణి హక్కుల్ని పొందిందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. అయితే ధనుష్ కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రాన్ని మేలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు, దానితో పాటు జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు, విజయ్‌ఆంటోని హీరోగా యమన్, కమలహాసన్ కథానాయకుడిగా ఒక చిత్రం నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. మొత్తం మీద మామ రజనీకాంత్‌లో 2, ఓ చిత్రాన్ని అల్లుడు ధనుష్‌తో వడచెన్నై చిత్రాలను లైకా సంస్థ ఏక కాలంలో నిర్మించడం అరుదైన విషయమే అవుతుంది.