నేనీ స్థాయిలో ఉండటానికి కారణం నా తమ్ముళ్లే

17 Oct, 2019 02:06 IST|Sakshi
వరంగల్‌ శ్రీను, కల్యాణ్, ఓంకార్, ఛోటా కె.నాయుడు, అశ్విన్, అవికా గోర్‌

– ఓంకార్‌

అశ్విన్, అవికా గోర్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజుగారి గది 3’. ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఓంకార్‌ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో ప్రముఖ కెమెరామన్‌ ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుంది. సాంకేతిక అభివృద్ధి వల్ల నటీనటుల్లో బద్ధకం పెరిగిందని నేను చెప్పినట్లు ఓ దిన పత్రికలో వచ్చింది. నా ఉద్దేశం అది కాదు. సాంకేతికత పెరగడం వల్ల సాంకేతిక నిపుణుల పని కాస్త తేలికైందని నా అభిప్రాయం’ అన్నారు.

‘‘యాంకర్‌ నుంచి నేనీ స్థాయికి ఎదగడానికి కారణం నా తమ్ముళ్లు అశ్విన్, కల్యాణ్‌. చదువును కూడా మర్చిపోయి నా కెరీర్‌ కోసం కష్టపడ్డారు. నాకు జన్మనిచ్చింది మా అమ్మానాన్నలు అయితే.. నా సినీ కెరీర్‌కు జన్మనిచ్చింది నా తమ్ముళ్లే. ఈ సినిమాతో అశ్విన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. కల్యాణ్‌ నిర్మాతగా త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న వరంగల్‌ శ్రీనుగారి నమ్మకం నిజం అవుతుందని నమ్ముతున్నాను. మా నాన్నగారు గత ఏడాది చనిపోయారు.

అందుకే నేను ఎక్కువగా తెల్ల దుస్తుల్లో కనిపిస్తున్నా. ఈ సినిమాతో అశ్విన్‌ను ప్రేక్షకులు హీరోగా అంగీకరించిన తర్వాత తిరిగి మామూలు దుస్తులు వేసుకుంటాను’’ అన్నారు ఓంకార్‌. ‘‘జీనియస్‌’ నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాను. హీరోగా ఈ శుక్రవారం నా డ్రీమ్‌ను చూడబోతున్నాను’’ అన్నారు అశ్విన్‌. ‘‘ఇదివరకు ‘హుషారు’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేశాను. ఈ విజయాల వరుసలో ఈ చిత్రం కూడా చేరుతుంది’’ అన్నారు వరంగల్‌ శ్రీను.
 

మరిన్ని వార్తలు