ఆయనతో ఇంకో సినిమా చేయాలనుంది!

30 Jan, 2018 00:48 IST|Sakshi
రాశీఖన్నా

‘‘ఓ సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ కథ ‘టచ్‌ చేసి చూడు’. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తుంది. ఈ సినిమా డబ్బింగ్‌ పూర్తి కాగానే రవితేజగారు నాకు ఫోన్‌ చేసి, చాలా బాగా చేశావని అభినందించారు. అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌’’ అని హీరోయిన్‌ రాశీఖన్నా అన్నారు. రవితేజ, రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ హీరో హీరోయిన్లుగా విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ‘టచ్‌ చేసి చూడు’ ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాశీఖన్నా పంచుకున్న విశేషాలు..

► ‘టచ్‌ చేసి చూడు’ చిత్రంలో నా పేరు పుష్ప. సాధారణంగా హీరోలకు వినోదం పండించే అవకాశం ఉంటుంది. కానీ హీరోయిన్లకు కామెడీ చేయడానికి స్కోప్‌ ఉండదు. అయితే.. ఈ సినిమాలో నాకు ఆ అవకాశం దొరికింది. రవితేజగారికి, నాకు మధ్య ఉన్న మంచి కామెడీ సీన్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి.
► నా కోసం, సినిమాల కోసం బరువు తగ్గాను. నటనకూ, గ్లామర్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలు చేయడం చాలా బాగుంది. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేస్తే బోర్‌గా ఉంటుంది. అందుకే విభిన్నమైన పాత్రలు చేయాలి.
► రవితేజగారు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. సెట్స్‌లో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఆయనతో పని చేయడం చాలా బాగుంటుంది. రవితేజగారితో ఇంకో సినిమా చేసే అవకాశం రావాలని
కోరుకుంటున్నా.  
► ‘టచ్‌ చేసి చూడు, తొలిప్రేమ’ సినిమాల్లో నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పాలనుకున్నా. కానీ టైమ్‌ దొరకలేదు. డబ్బింగ్‌ చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వీలు కుదరలేదు.
► సీనియర్‌ హీరోలతో పనిచేస్తున్నప్పుడు వాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. యంగ్‌ హీరోల  నుంచి కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను. నాకు టాలీవుడ్‌లో బాగుంది. మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. చాలా హ్యాపీ. అటువంటప్పుడు బాలీవుడ్‌ ప్రయత్నాలు ఎందుకు? అందుకే చేయడం లేదు.

మరిన్ని వార్తలు