సాక్షి, సినిమా: కోరికలు అంత ఈజీగా నెరవేరవంటారు. ఒక వేళ అవి నెరవేరితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. అయితే అనుకోకుండానే అందలం ఎక్కేసిన నటి సాయిపల్లవి. ఈ మలయాళ అమ్మడు తొలి చిత్రం ప్రేమమ్తో మలయాళ సినీ ప్రియుల ప్రేమాభిమానాలను పొందింది. ఈ చిత్రంలో మలర్ టీచర్గా నటించి ఒక్క కేరళ ప్రేక్షకులనే కాకుండా తమిళనాడు, ఆంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే తెలుగులో ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసిన సాయిపల్లవి టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందింది.
పల్లవి త్వరలో కరు చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకోవడానికి సిద్ధం అవుతోంది. అయితే ఆ చిత్రం విడుదలకు ముందే మరో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుందన్నది తాజా సమాచారం. తనకు నటుడు సూర్య అంటే చాలా ఇష్టం అని, ఆయనతో నటించే అవకాశం వస్తే వదులుకునేది లేదని ఒకానొక సందర్భంలో వెల్లడించింది. అయితే అలాంటి అవకాశం ఇంత తొందరగా వస్తుందని బహూశ సాయిపల్లవి కూడా ఊహించి ఉండదు. అలాంటి తన కోరిక తీరే తరుణం వచ్చేసింది.
సూర్య తాజాగా తానాసేర్న్దకూట్టం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటి కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇక సూర్య తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇందులో నటి రకుల్ప్రీత్సింగ్ ఆయనకు జంటగా నటించబోతున్నట్లు చాలానే ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ఏమిటంటే ఇందులో మరో నాయకిగా సాయిపల్లవి నటించనుంది. ఈ విషయమై దర్శకుడు సెల్వరాఘవన్ ఇప్పటికే సాయిపల్లవితో చర్చలు జరిపారని, తనూ నటించడానికి అంగీకరించిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. డ్రీమ్ వారియర్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ చిత్రం జనవరి రెండవ భాగంలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సెల్వరాఘవన్ సంతానం హీరోగా మన్నవన్ వందానడి చిత్రాన్ని పూర్తి చేయనున్నారు.