అంతా రెడీ

4 Jan, 2020 01:21 IST|Sakshi
మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌

ఎప్పటిలాగే ఈ సంక్రాంతి పండగ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ముస్తాబు అవుతోంది. సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. పండగ బరిలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో’ చిత్రాల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలు చేశారు.  ‘దిల్‌’ రాజు సమర్పణలో అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు ముగిశాయి. యు/ఎ సర్టిఫికెట్‌ లభించింది.

ఈ  సినిమా నిడివి 2గంటల 46 నిమిషాలని తెలిసింది. ఇక ‘జులాయి (2012), సన్నాఫ్‌ సత్యమూర్తి (2015)’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటించారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, మురళీ శర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి కూడా యు/ఎ సర్టిఫికెట్‌ లభించింది. ఈ చిత్రం నిడివి 2గంటల 36 నిమిషాలని తెలిసింది. ఈ రెండు చిత్రాలు కాకుండా పండగకి సందడి చేయబోతున్న చిత్రాలు మూడు నాలుగు వరకూ ఉన్నాయి.

మరిన్ని వార్తలు