మద్యానికి బానిసయ్యానా?

18 Oct, 2019 08:02 IST|Sakshi

సినిమా: తాను మద్యానికి బానిసనయ్యానా అంటూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది నటి శ్రుతీహాసన్‌. కొంత గ్యాప్‌ తరువాత ఈ బ్యూటీ మరోసారి వార్తల్లో నానుతోంది.  ఇంతకు ముందు హిందీ, తెలుగు, తమిళం అంటూ బిజీగా నటించిన శ్రుతిహాసన్‌  లండన్‌కు చెందిన మైఖెల్‌ కోర్సెల్‌ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి నటనకు దూరమైంది. అయితే ఆ సమయంలో సంగీత ఆల్బమ్స్‌పై దృష్టి పెట్టినట్లు శ్రుతిహాసన్‌ పేర్కొంది. కాగా ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ కావడంతో మళ్లీ నటనపై దృష్టిసారించింది. ప్రస్తుతం తమిళంలో లాభం అనే చిత్రంలో నాయకిగా నటిస్తోంది. త్వరలో తెలుగులో ఒక భారీ చిత్రం చేయడానికి సిద్ధం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఈ బ్యూటీ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక టైమ్‌లో తాను మద్యానికి బానిసనయ్యానని, దాంతో శారీరకంగా బాధింపునకు గురైనట్లు పేర్కొంది. అందుకు చికిత్స పొందినట్లు చెప్పింది.

అందుకే తాను కొంతకాలం సినిమాకు దూరంగా ఉన్నానని తెలిసింది. ఈ విషయం సామాజక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అయితే దీనిపై స్పందించిన నటి శ్రుతిహాసన్‌ తన మాటలను వక్రీకరించారని ఆరోపించింది. నిజానికి తానిప్పుడు మద్యం తాగడం లేదని, ప్రశాంతంగా జీవిస్తున్న తన గురించి మద్యానికి బానిసైనట్లు ఎలా వదంతులు పుట్టిస్తారని ఆవేదనను వ్యక్తం చేసింది. మద్యం తాగడం అన్నది నేటి సంస్కృతిలో ఒక భాగంగా మారిందని అంది. అందులో తప్పేమీలేదంది. అయితే తాను ఆ పనిని తరచూ చేయడానికి ఇష్టపడడం లేదని చెప్పింది. తానిప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆశపడుతున్నట్లు పేర్కొంది. తాను మద్యం తాగేవారికి సపోర్టు చేయడం లేదని అంది. అయితే ఇంచుమించు అందరూ మద్యం తాగుతున్నారని, అయితే ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడడం లేదని అంది. ప్రజలే అప్పుడప్పుడు మద్యం తాగుతున్నట్లు అంగీకరిస్తున్నారని చెపింది. తానిప్పుడు మద్యం తాగడం లేదని చెప్పగా తన వ్యాఖ్యలను వక్రీకరించారని నటి శ్రుతిహాసన్‌ ఆవేదనను వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు