యువహీరోతో సీనియర్ తారల హంగామా!

12 Dec, 2014 22:31 IST|Sakshi
యువహీరోతో సీనియర్ తారల హంగామా!

బి. సరోజాదేవి... 1950, 60లలో తిరుగు లేని తార. ఖుష్బూ, సిమ్రాన్... 1990, 2000లలో హవా నడిపించిన తారలు. ఈ ముగ్గురూ కలిసి ఒక పాటలో కనిపిస్తే.. చూడటానికి కనువిందుగా ఉంటుంది. అందుకు వేదిక కానుంది తమిళ చిత్రం ‘వాలు’. శింబు, హన్సిక జంటగా రూపొందుతున్న ఈ చిత్రం ఓ పాట మినహా పూర్తయ్యింది. త్వరలో ఆ పాటను చిత్రీకరించనున్నారు.
 
ఈ పాటలోనే ఈ ముగ్గురు తారలూ కనిపించనున్నారు. ఇందులో దివంగత నటుడు ఎమ్జీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో అజిత్.. గెటప్స్‌లో శింబు కనిపిస్తారట. ఎమ్జీఆర్ గెటప్ సీక్వెన్స్‌లో ఈ యువహీరోతో కలిసి సరోజా దేవి కాలు కదుపుతారు.

రజనీకాంత్ వేషానికి ఖుష్బూ జతకడతారు. అజిత్‌లా మారినప్పుడు సిమ్రాన్ కాలు కదుపుతారట. మూడు తరాలకు చెందిన ముగ్గురు నాయికలతో శింబు డాన్స్ చేయడం అంటే ఆసక్తిగానే ఉంటుంది. ఆ విధంగా ఈ పాట ‘వాలు’కి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెప్పొచ్చు. వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.